అంత ఇంటి అద్దె చెల్లించలేను: బేరమాడిన ప్రియాంక
న్యూఢిల్లీ: దివంగత మాజీ ప్రధాని రాజీవ్గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ కుమార్తె ప్రియాంకా గాంధీ వాద్రా కూడా సాధారణ మహిళలా బేరసారాలు ఆడారు. 14 ఏళ్ల క్రితం వాజ్పేయి ప్రభుత్వం అధికారంలో ఉండగా, తనకు కేటాయించిన 2,765 చదరపు మీటర్ల ఇంటికి రూ. 53,421 అద్దె చెల్లించలేనని, తనకు అంత స్థోమత లేదని ప్రియాంక చెప్పారట.
దీంతో ఆమె విన్నపాన్ని అంగీకరించిన సర్కారు సరేనంటూ రూ. 8,888 అద్దె చెల్లిస్తే సరిపోతుందని చెప్పింది. కాగా, ఈ విషయం తాజగా వెలుగులోకి వచ్చింది. 2002 మే 7వ తేదీన ప్రియాంకా గాంధీ ప్రభుత్వానికి ఓ లేఖ రాసింది. అందులో రూ. 53,421 అద్దె తనకు చాలా ఎక్కువని, అంత చెల్లించలేనని పేర్కొన్నారు.
కేవలం ఎస్పీజీ వాళ్లు కోరడం వల్లే తాను ఆ బంగ్లాలో ఉంటున్నానని, పైగా అందులో చాలా భాగంలో వాళ్లే ఉంటున్నారు తప్ప తన కుటుంబ సభ్యులు ఉండట్లేదని కూడా ఆమె తెలిపారు. ప్రస్తుతం లోదీ ఎస్టేట్లోని టైప్4 ప్రభుత్వ భవనంలో ఉంటున్న ప్రియాంకా గాంధీ, దానికి రూ. 31,300 అద్దె చెల్లిస్తున్నారు.
ఆమెతో పాటు పంజాబ్ మాజీ డీజీపీ కేపీఎస్ గిల్, ఆలిండియా ఉగ్రవాద వ్యతిరేక ఫ్రంట్ అధ్యక్షుడు ఎంఎస్ బిట్టా, పంజాబ్ కేసరి పత్రిక సంపాదకుడు అశ్వనీకుమార్లకు భద్రతా కారణాల రీత్యా ప్రభుత్వం క్వార్టర్లను కేటాయించింది. గిల్, బిట్టా దాదాపు అంతేమొత్తాన్ని చెల్లిస్తుండగా, అశ్వనీకుమార్ మాత్రం 2012లో ఖాళీ చేశారు.