ఆప్ఘాన్ పరిస్థితులపై నిశితంగా పరిశీలిస్తున్నాం, మెజార్టీ భారతీయులను తరలించాం: తాలిబన్లపై భారత్
న్యూఢిల్లీ: ఆఫ్ఘనిస్థాన్లోని మెజార్టీ భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చినట్లు భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి తెలిపారు. తాలిబన్ల స్వాధీనంలోకి వెళ్లిన నాటి నుంచి ఆప్ఘాన్లో చోటు చేసుకుంటున్న పరిణామాలను జాగ్రత్తగా పరిశీలిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
ఆఫ్ఘనిస్థాన్లో చిక్కుకుపోయిన భారతీయులను తరలించడంపైనే దృష్టిపెట్టినట్లు అరిందమ్ బాగ్చి తెలిపారు. ఖచ్చితంగా అక్కడ ఎంతమంది ఉన్నారో తెలియదని, అయితే, చిక్కుకున్న వారందరినీ స్వదేశానికి తరలిస్తామన్నారు. ఆప్ఘాన్లో చోటు చేసుకుంటున్న పరిణామాలను ఎప్పటికప్పుడు చాలా నిశితంగా గమనిస్తున్నట్లు వెల్లడించారు.
ఆప్ఘనిస్థాన్లో తాలిబన్ల పాలనను భారత్ గుర్తిస్తుందా? అని మీడియా అడిగిన ప్రశ్నకు బాగ్చి బదులిస్తూ.. కాబూల్లో ఏ సంస్థ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందనే అంశంపై ఇప్పటికైతే స్పష్టత రాలేదన్నారు. క్షేత్రస్థాయిలో అనిశ్చితి పరిస్థితులే ఉన్నాయని, అక్కడి ప్రజల భద్రతే ఆందోళనకరంగా ఉందని బాగ్చి వ్యాఖ్యానించారు.

కాబూల్ (ఆఫ్ఘనిస్తాన్), దుషాన్బే (తజికిస్తాన్) నుంచి ఇప్పటివరకు భారతదేశం ఆరు విమానాల ద్వారా.. 550 మందికి పైగా ప్రజలను తిరిగి తీసుకువచ్చిందని ప్రతినిధి తెలియజేశారు. వీరిలో 260 మందికిపైగా భారతీయులు ఉన్నారు. భారత ప్రభుత్వం ఇతర ఏజెన్సీల ద్వారా భారత జాతీయుల తరలింపును సులభతరం చేసింది. తాము అమెరికా, తజికిస్తాన్ వంటి వివిధ దేశాలతో సంప్రదింపులు జరుపుతున్నామని చెప్పారు.
భారతదేశం కొంతమంది ఆఫ్ఘన్ జాతీయులతో పాటు ఇతర దేశాల పౌరులను కూడా తరలించింది. వీరిలో చాలా మంది సిక్కులు, హిందువులు ఉన్నారని బాగ్చి చెప్పారు. ఏదేమైనా, న్యూఢిల్లీ ప్రధానంగా భారతీయ పౌరులను తరలించడంపై దృష్టి పెడుతోందని, కానీ "మాకు అండగా నిలిచిన ఆఫ్ఘన్లకు అండగా నిలుస్తుందని" ఆయన స్పష్టం చేశారు.
ఆగస్టు 31 వరకే తరలింపునకు అనుమతిస్తామని, ఆ తర్వాత పౌరుల తరలింపును అడ్డుకుంటామని తాలిబన్లు ఆల్టిమేటం జారీ చేయడంతో భారత్ సహా పలు దేశాలు హుటాహుటిన తరలింపును చేపడుతున్నాయి. అయితే, ఈ క్రమంలోనే గురువారం సాయంత్రం ఐఎస్ ఉగ్రవాదులు కాబూల్ విమానాశ్రయం వద్ద ఆత్మాహుతి దాడులకు తెగబడి 100 మందికిపైగా ప్రాణాలు తీశారు. 150 మందికిపైగా పేలుళ్లు గాయపడినవారు ఆస్పత్రుల పాలయ్యారు. ఈ నేపథ్యంలో పౌరుల తరలింపు ఇతర దేశాలకు సవాలుగా మారింది. మరో రెండు మూడు రోజుల్లోనే ఈ తరలింపు కొనసాగే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. నేటితోనే పలుదేశాలు తరలింపును ఆపివేయడం గమనార్హం.
భారత్పై ఉగ్రవాదుల కుట్రలు
ఆప్ఘనిస్థాన్లో తాలిబన్ల రాజ్యం మొదలైన నాటి నుంచి ఉగ్రవాదులంతా మరోసారి తమ కార్యకలాపాలను విస్తృతం చేసేందుకు సిద్ధమవుతున్నట్లుగా కనిపిస్తోంది. ఆప్ఘనిస్థాన్ను తమ ఆధీనంలోకి తీసుకున్న తర్వాత తాలిబన్లు పలు జైళ్లలో ఖైదీలుగా ఉన్న అనేకమంది ఉగ్రవాదులను విడిపించడం గమనార్హం. అంటే, తాలిబన్లు ఇతర ఉగ్రవాదులతో కలిసి పనిచేసేందుకు సుముఖంగా ఉన్నట్లు అర్థమవుతోంది.
తాలిబన్ల ఆధీనంలో ఉన్న ఆప్ఘనిస్థాన్ను పాకిస్థాన్ తర్వాత మరో నివాసంగా చేసుకునేందుకు ఐఎస్, లష్కరే తొయిబా లాంటి ఉగ్రవాద సంస్థలు సిద్దమవుతున్నాయి. ఇక ఇప్పుడు పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదులకు ఆప్ఘనిస్థాన్ కేంద్రంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో భారత్కు ఉగ్రముప్పు పొంచివున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే పాకిస్థాన్కు చెందిన ఉగ్రవాద సంస్థ జేషే మొహమ్మద్ చీఫ్ మౌలానా మసూద్ అజహర్.. ఆప్ఘన్ తాలిబన్లతో కలవడం కలకలం రేపుతోంది. మౌలానా మసూద్ అజహర్ జమ్మూకాశ్మీర్లో ఉగ్రవాద కార్యకలాపాలను విస్తృతం చేసేందుకు తాలిబన్ల సాయం కోరినట్లుగా తెలుస్తోంది.
తాలిబన్ పొలిటికల్ కమిషన్ అధిపతి ముల్లా అబ్దుల్ ఘనీ బరాదర్ తోపాటు పలువురు తాలిబన్ నేతలను కాందహార్ చేరుకున్న మసూద్ అజహర్ కలిసినట్లు సమాచారం. కాశ్మీర్ వ్యాలీలో జైషే మొహ్మద్ కార్యకలాపాలను విస్తృతం చేసేందుకు తాలిబన్ల సహకారం కావాలని వారిని కోరినట్లు తెలిసింది. ఆగస్టు 15న కాబూల్ తోపాటు మొత్తం ఆప్ఘనిస్థాన్ను తాలిబన్లు ఆక్రమించుకోవడం తమకు ఎంతో ఆనందంగా ఉందని ఆ సమయంలో మసూద్ అజహర్ ప్రకటించడం గమనార్హం. తాలిబన్లు అమెరికా మద్దతుతో నడుస్తున్న ఆప్ఘన్ ప్రభుత్వంపై విజయం సాధించారని హర్షం వ్యక్తం చేశారు. అంతేగాక, పాకిస్థాన్ కేంద్ర కార్యాలయం నుంచి మసూద్ అజహర్ శుభాకాంక్షలు కూడా తెలియజేశారు.
కాగా, ఆఫ్ఘానిస్థాన్లో తాలిబాన్లు అధికారంలో ఉన్నప్పుడు 1999లో ఖాట్మాండ్ నుంచి లక్నోకి బయల్దేరిన ఇండియన్ ఎయిర్ లైన్స్ విమానాన్ని పాకిస్థాన్ టెర్రరిస్టులు హైజాక్ చేసి కాందహార్కు తీసుకెళ్లి ప్రయాణికులకు బదులుగా మన దేశంలోని జైలులో శిక్ష అనుభవిస్తున్న జైషే మొహమ్మద్ ఉగ్రసంస్థ చీఫ్ జైషే మొహమ్మద్ చీఫ్ మసూద్ అజహర్ సహా ముగ్గురని ఉగ్రవాదులు విడిపించుకున్న విషయం తెలిసిందే. అయితే రెండు దశాబ్దాల తర్వాత ఇప్పుడు అప్ఘానిస్తాన్ మళ్లీ తాలిబన్ల హస్తగతమైన వేళ.. జైషే మొహమ్మద్ శ్రేణుల్లో సంతోషం వెల్లివిరిస్తోంది. తాలిబాన్ల అండ చూసుకుని కాశ్మీర్ లోయలో ఉగ్రవాద కార్యకలాపాలు పెంచాలని జైషే మొహమ్మద్ భావిస్తోంది.
Recommended Video
నిఘా వర్గాల సమాచారం ప్రకారం ఆగస్టు మూడో వారంలోనే కాందహార్ చేరుకున్న మసూద్ అజహర్.. తాలిబన్ సహ వ్యవస్థాపకుడు ముల్లా అబ్దుల్ ఘనీ బరాదర్ సహా పలువురు కీలక తాలిబాన్ నేతలను కలిసి కాశ్మీర్ లోయలో ఉగ్రవాదాన్ని ప్రేరేపించడానికి సహకరించాల్సిందిగా కోరారు. తాలిబాన్, జైషే మొహమ్మద్లు భావజాల సారూప్యమున్న సంస్థలుగా పేర్కొంటుంటారు. ఇస్లామిక్ చట్టం అయిన షరియాను తమకు తగినట్లుగా అన్వయించుకోవడంలో తాలిబాన్, జైషే మహ్మద్ సైద్ధాంతిక సహచరులుగా పరిగణించబడ్డారు. మసూద్ అజహర్ 1999లో భారత జైలు నుంచి విడుదలైన తర్వాత జైషే మొహమ్మద్ ఉగ్రవాద సంస్థను స్థాపించాడు. జమ్మూకాశ్మీర్లో ఉగ్ర కార్యకలాపాలను పెంచేందుకు నాటి నుంచి నేటి వరకు ప్రయత్నాలు కొనసాస్తూనే ఉంది.












Click it and Unblock the Notifications