ఒకేరోజు 8వేల మందిపై కేసులు.. సీఏఏ నిరసనలపై చెన్నై సీపీ సీరియస్ యాక్షన్
పౌరసత్వ సవరణ, ఎన్ఆర్సీ చట్టాలను రద్దు చేయాలంటూ దేశవ్యాప్తంగా నిరసనలతోపాటు అదే స్థాయిలో కేసుల నమోదు, అరెస్టుల పర్వం కొనసాగుతోంది. తమిళనాడులోనైతే ఒకే రోజు ఏకంగా 8వేల మందిపై కేసులు నమోదు కావడం గమనార్హం. అనుమతి నిరాకరించినా లెక్కచేయకుండా సోమవారం చెన్నై సిటీలో భారీ ప్రదర్శన చేసిన డీఎంకే, కాంగ్రెస్, ఇతర పార్టీల నేతలు, కార్యకర్తలపై చెన్నై పోలీస్ కమిషనర్ తీవ్రచర్యలకు దిగారు.
సీపీ ఎం చెప్పారంటే..
డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్, ఆ పార్టీ యూత్ వింగ్ నాయకుడు ఉదయనిధి స్టాలిన్, కాంగ్రెస్ ఎంపీ పి.చిదంబరం, ఎండీఎంకే నేత వైగో తదితర ముఖ్యులతోపాటు ఆయా పార్టీలకు చెందిన 8వేల మందిపై కేసులు నమోదుచేసినట్లు చెన్నై సిటీ పోలీస్ కమిషనర్ ఏకే విశ్వనాథన్ మద్రాస్ హైకోర్టుకు తెలిపారు. నిరసన యాత్ర శాంతియుతంగానే ముగిసినప్పటికీ, పోలీసుల ఆదేశాల్ని లెక్కచేయకుండా, చట్టాన్ని ఉల్లంఘించిన కారణంగానే నాయకులు, కార్యకర్తలపై కేసులు పెట్టామని సీపీ చెప్పారు.

వేలల్లో కేసులు.. వందలకొద్దీ అరెస్టులు
సీఏఏ, ఎన్ఆర్సీ చట్టాలకు వ్యతిరేకంగా అన్ని రాష్ట్రాల్లో నిరసనలు జరుగుతుండటంతో పెద్ద సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. మహారాష్ట్రలో సోమవారం నాటికి 12వేల మంది నిరసనకారులపై కేసులు నమోదుకాగా, 104 మంది అరెస్టయ్యారు. అస్సాంలో 244 కేసులకు సంబంధించి 393 మందిని అరెస్టు చేసినట్లు ఆ రాష్ట్ర ఆర్థిక మంత్రి హింత బిశ్వాస్ చెప్పారు. యూపీలోనూ అరెస్టుల సంఖ్య భారీగానే ఉంది.












Click it and Unblock the Notifications