అమ్మ ఆరోగ్యం విషమించిందని పోస్టు! : మహిళపై కేసు, డీఎంకే నేతల అరెస్టు
చెన్నై : తమిళనాడు సీఎం జయలలిత ఆరోగ్య పరిస్థితుల మీద జరుగుతున్న వదంతుల ప్రచారం తీవ్ర గందరగోళానికి గురిచేస్తోంది. ఓవైపు జయలలిత ఫోటోలు విడుదల చేయాలని డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి డిమాండ్ చేస్తుండగా.. మరోవైపు సోషల్ మీడియాలో కొంతమంది అనవసర గందరగోళానికి గురిచేసే ప్రయత్నాలు చేస్తున్నారు.
తాజాగా జయలలిత ఆరోగ్యం క్షీణిస్తోందంటూ ఓ ఫ్రాన్స్ మహిళ సోషల్ మీడియాలో పోస్టు పెట్టింది. ఇది కాస్త పోలీసుల దృష్టికి వెళ్లడంతో.. ఆమెపై కేసు నమోదు చేశారు పోలీసులు. అలాగే జయలలిత ఆరోగ్యంపై దుష్ప్రచారం చేస్తోన్న పదిమంది డీఎంకే కార్యకర్తలను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇదిలా ఉంటే.. జయ ఆరోగ్యంపై ఇప్పటివరకు అధికారిక ప్రకటనేది రాకపోవడంతో.. వదంతులు మరింత షికారు చేస్తున్నాయి.
కాగా, స్వల్ప అనారోగ్యం కారణంగా.. పదిరోజుల క్రితం చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చేరారు జయలలిత. రెండు రోజులుగా ఆమె ఆరోగ్య పరిస్థితిపై ఎలాంటి బులెటిన్ విడుదల చేయకపోవడంతో.. ఆమె ఆరోగ్యం విషమించిందంటూ దుష్ప్రచారం జరుగుతోంది. దీనిపై స్పందించిన ఏఐడీఎంకే నేతలు పుకార్లను నమ్మవద్దని ప్రకటన చేశారు. ప్రస్తుతం జయలలిత చికిత్స పొందుతోన్న అపోలో ఆసుపత్రి వద్ద భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.