మీ ఇష్టం: కావేరీ బోర్డుపై సుప్రీంకోర్టుకు కేంద్రం ముసాయిదా
న్యూఢిల్లీ: కావేరీ నదీ జలాల విషయంలో కేంద్ర ప్రభుత్వం సోమవారం సుప్రీంకోర్టుకు ముసాయిదాను సమర్పించింది. తమిళనాడులో కావేరీ మేనేజ్మెంట్ బోర్డును ఏర్పాటుచేయాల్సిందిగా కొంతకాలంగా రాష్ట్రంలో ఆందోళనలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మే 4కల్లా ముసాయిదాను సమర్పించాల్సిందిగా కేంద్రాన్ని ఆదేశించింది.
అయితే, కర్ణాటక ఎన్నికల్లో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ ప్రచార కార్యక్రమాలతో బిజీగా ఉండడంతో ముసాయిదాను సమర్పించలేకపోయామని కోర్టుకు కేంద్రం వివరించింది. దీంతో నీటి వనరుల శాఖ సెక్రటరీ వ్యక్తిగతంగా ముసాయిదాను అందించాలని లేదంటే కేంద్రం కోర్టును ధిక్కరించినట్లేనని సుప్రీం తేల్చి చెప్పింది.
ఈ నేపథ్యంలో సోమవారం కేంద్రం ముసాయిదాను సమర్పించింది. కావేరీ మేనేజ్మెంట్ బోర్డును బోర్డు అనాలా? కమిటీ అనాలా? అథారిటీ అనాలా? అన్న విషయాన్ని సుప్రీంకోర్టుకే వదిలేస్తున్నట్లు కేంద్రం పేర్కొంది. 9మంది సభ్యులతో అథారిటీని ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపింది. ఆ అథారిటీ సూచనల మేరకు రాష్ట్ర ప్రభుత్వాలు డ్యామ్ కార్యకలాపాలను చూసుకుంటాయని తెలిపింది.

చాలా కాలంగా నడుస్తున్న కావేరీ నదీ జలాల వివాదం నేపథ్యంలో ఫిబ్రవరిలో సుప్రీం కోర్టు తీర్పు వెలువరిస్తూ తమిళనాడు కంటే కర్ణాటకకే ఎక్కువ టీఎంసీలు అందాలని ఆదేశించింది. దీంతో తమిళనాడులో ఆందోళనలు మిన్నంటాయి. కావేరీ మేనేజ్మెంట్ బోర్డు విషయమై సుప్రీం కోర్టు స్పందిస్తూ ఇప్పుడు ఇస్తున్నదానికంటే 4 టీఎంసీలు ఎక్కువగా తమిళనాడుకు కావేరీ నీరు కేటాయించాలని.. లేకపోతే పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆదేశించింది.
కానీ, ఇందుకు కర్ణాటక ఒప్పుకోలేదు. తమ వద్ద తమిళనాడుకు ఇచ్చేంత నీళ్లు లేవని, తమ అవసరాలకు తగినట్లుగానే ఉన్నాయని కోర్టుకు తెలిపింది. ఇప్పుడు ముసాయిదాను సమర్పించడంతో తమిళనాడులో మేనేజ్మెంట్ బోర్డు విషయమై సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకోనుంది.












Click it and Unblock the Notifications