'చైల్డ్ పోర్నోగ్రఫీ': దిమ్మతిరిగే వాస్తవాలు.. సీబీఐ అదుపులో నిందితుడు..
న్యూఢిల్లీ: అంతర్జాతీయ చైల్డ్ పోర్నోగ్రఫీ ముఠా గుట్టురట్టు చేసింది సీబీఐ. వాట్సాప్ ద్వారా కొనసాగుతున్న ఈ పోర్నో రాకెట్ ను గురువారం బట్టబయలు చేసింది. ఈ వ్యవహారంలో ప్రధాన నిందితుడైన నిఖిల్ వర్మ అనే వాట్సాప్ అడ్మిన్ను అరెస్ట్ చేశారు. అతని మొబైల్ ఫోన్లు, ట్యాబ్లెట్లు, ల్యాప్టాప్లలో చిన్నారుల అశ్లీల వీడియోలను గుర్తించారు.
సీబీఐ అదుపులో 'నిఖిల్ వర్మ'..:
చైల్డ్ పోర్నోగ్రఫీ ప్రధాన నిందితుడైన నిఖిల్ వర్మ.. ఒక జ్యువెలరీ షాపు యజమాని కొడుకుగా సీబీఐ గుర్తించింది. కామర్స్ కోర్సులో డిగ్రీ చేస్తున్న నిఖిల్.. ప్రస్తుతానికి నిరుద్యోగిగానే ఉన్నాడని తెలిపింది.
పాక్, శ్రీలంక,అమెరికా వ్యక్తులు కూడా..:
విచారణలో గుర్తించిన వాట్సాప్ గ్రూప్ మెంబర్స్ అందరి మీద సీబీఐ కేసులు పెట్టింది. చైల్డ్ పోర్నోగ్రఫీని సర్క్యులేట్ చేస్తున్న ఈ గ్రూపులో అమెరికా, పాకిస్తాన్, చైనా, శ్రీలంక దేశాలకు చెందిన నిందితులు కూడా ఉన్నట్టు గుర్తించింది. చైల్డ్ పోర్నోగ్రఫీ ముఠా కార్యకలాపాలు తెలుసుకునేందుకు ఢిల్లీ, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ లలోని పలు చోట్ల సీబీఐ తనిఖీలు చేస్తోంది.
వాట్సాప్ గ్రూప్ ద్వారా..:
'కిడ్స్XXX'అనే వాట్సాప్ గ్రూప్ ద్వారా వీరు చైల్డ్ పోర్నోగ్రఫీ సర్క్యులేట్ చేస్తున్నారని, ఇందులో మొత్తం 119మంది వ్యక్తులు ఉన్నారని సీబీఐ పేర్కొంది. నిందితుడు నిఖిల్ వర్మతో పాటు నఫీస్ రేజా, ఢిల్లీకి చెందిన జహీద్, ముంబైకి చెందిన ఓం ప్రకాష్ చౌహాన్, నోయిడాకు చెందిన ఆదర్శ్ లను సీబీఐ బుక్ చేసింది.
ఐపీ అడ్రెసుల ఆధారంగా:
నిందితుల వాడుతున్న కంప్యూటర్ల ఐడీ అడ్రసుల ఆధారంగా సీబీఐ అధికారులు వారిని పట్టకోగలిగారు. నిందితులకు ఏడేళ్ల జైలు శిక్షతో పాటు రూ.10లక్షల వరకు జరిమానా విధించే అవకాశాలున్నాయని చెప్పారు.