ఐఎఫ్సీఐలో రూ. 22 కోట్ల మోసం: మెహుల్ చోక్సీపై మరో కేసు నమోదు చేసిన సీబీఐ
న్యూఢిల్లీ: దేశం నుంచి పారిపోయిన ఆర్థిక నేరగాడు, వ్యాపారవేత్త మెహుల్ చోక్సీ, ఆయన కంపెనీ గీతాంజలి జెమ్స్పై మరో మోసం కేసు నమోదు చేసింది సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్విస్టిగేషన్(సీబీఐ). 2014-18 మధ్య కాలంలో ఇండస్ట్రియల్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఐఎఫ్సీఐ)ని రూ. 22 కోట్ల మేర మోసం చేసినట్లు అభియోగాలు నమోదు చేసింది.
CBI FIR ప్రకారం.. IFCI లిమిటెడ్ GGL, చోక్సీల ప్రాతినిధ్యాలు, హామీలు, అండర్టేకింగ్లపై ఆధారపడింది. ఇది కాకుండా, తాకట్టు పెట్టిన ఆభరణాల విలువను సూరజ్మల్ లల్లూ భాయ్, కో, నరేంద్ర ఝవేరి, ప్రదీప్ షా, శ్రేనిక్ షా వంటి వాల్యూయర్లు అంచనా వేశారు. ప్రముఖ వాల్యూయర్లు విలువ కట్టిన షేర్లు, వజ్రాలు, బంగారు పొదిగిన ఆభరణాల తాకట్టుపై రెండు రెట్లు సెక్యూరిటీ కవర్ ఆధారంగా రుణాలు పంపిణీ చేశారని ఆరోపించారు.
'వజ్రాలు తక్కువ నాణ్యత గల లేబొరేటరీలో తయారు చేయబడిన రసాయన ఆవిరి వజ్రాలు, ఇతర నాసిరకం రంగు రాళ్లని, నిజమైన రత్నాలు కాదని కూడా వెలుగులోకి వచ్చింది' అని హిందుస్థాన్ టైమ్స్ నివేదించిన ప్రకారం CBI తన ఎఫ్ఐఆర్లో పేర్కొంది.
పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్బీ)లో రూ. 13,500 కోట్ల మోసానికి పాల్పడి విదేశాలకు పారిపోయిన మెహుల్ చోక్సీని స్వదేశానికి తీసుకొచ్చేందుకు సీబీఐ, ఈడీలు విశ్వప్రయత్నాలు చేసినప్పటికీ.. సాధ్యం కావడం లేదు. గత ఏడాది మే 23న డొమినికాలో అదృశ్యమైనట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. మే 26న ఆయనను అక్కడి అధికారులు పట్టుకున్నారు. కాగా, డొమినికన్ కోర్టులో చోక్సీ తరపు లాయర్ హెబియస్ కార్పస్ దాఖలు చేశారు.
పీఎన్బీ కుంభకోణం కేసులో దేశం దాటిన వ్యాపారవేత్త, ప్రధాన నిందితుడు నీరవ్ మోడీకి చోక్సీ బంధువు కావడం, అంతేగాక, ఈ స్కాంలో నిందితుడు కూడా. దీంతో నీరవ్ మోడీ తర్వాత మెహుల్ చోక్సీ కూడా దేశం విడిచిపారిపోయాడు. వీరిద్దరిపై వేర్వేరు కేసులు నమోదు చేసిన సీబీఐ, ఈడీ స్వదేశానికి తీసుకొచ్చేందుకు చేస్తున్న ప్రయత్నాలు విఫలమే అవుతున్నాయి.