సీబీఐ కార్యాలయంపై పోలీస్ నజర్... తాత్కాలిక డైరెక్టర్ నియామకం
ఢిల్లీ : అలోక్ వర్మను సీబీఐ డైరెక్టర్ పదవి నుంచి మరోసారి తప్పించింది హై పవర్ కమిటీ. ఆయనపై ఆరోపణలు రావడంతో ఇటీవల ఆ పదవి నుంచి తప్పించింది కేంద్రం. తాజాగా సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో సీబీఐ డైరెక్టర్ గా మరోసారి పదవీబాధ్యతలు స్వీకరించారు. అయితే ఉన్నతస్థాయి కమిటీ అలోక్ వర్మను తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈనేపథ్యంలో అవాంఛనీయ ఘటనలు జరగకుండా సెంట్రల్ గవర్నమెంట్ ముందస్తు చర్యలు తీసుకుంది. ఈనేపథ్యంలో గురువారం రాత్రి సీబీఐ కేంద్ర కార్యాలయాన్ని పోలీసులు ఆధీనంలోకి తీసుకున్నారు. బలగాలను మోహరించి భద్రత కట్టుదిట్టం చేశారు.
అలోక్ వర్మను సీబీఐ డైరెక్టర్ పదవి నుంచి తొలగిస్తూ.. తాత్కాలికంగా మన్నెం నాగేశ్వరరావును నియమించింది కేంద్రం. కొత్త డైరెక్టర్ వచ్చేంతవరకు లేదంటే తదుపరి ఉత్తర్వులు విడుదలయ్యేవరకు ఆయనే ఈ పదవిలో కొనసాగనున్నారు.
సీబీఐ తాత్కాలిక డైరెక్టర్గా నియమితులైన నాగేశ్వరరావు.. తెలంగాణ రాష్ట్రానికి చెందినవారు. వరంగల్ జిల్లాలోని భూపాలపల్లి జిల్లా మంగపేట మండలం బోరునర్సాపురం గ్రామంలో జన్మించారు. వ్యవసాయ కుటుంబ నేపథ్యమున్న నాగేశ్వరరావు కెరీర్ లో అంచెలంచెలుగా ఎదుగుతూ అత్యున్నత స్థాయికి చేరుకున్నారు.