మనీశ్ సిసోడియా ఆఫీస్ నుంచి కంప్యూటర్ పట్టుకెళ్లిన సీబీఐ: సోదా కాదంటూ క్లారిటీ
న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ కేసులో సీబీఐ దర్యాప్తు కొనసాగుతోంది. ఇందులో భాగంగానే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా కార్యాలయంలో కేంద్ర దర్యాప్తు సంస్థ మరోసారి సోదాలు చేపట్టింది. ఈ విషయాన్ని సిసోడియానే ట్విట్టర్లో వెల్లడించారు.
ఈరోజు సీబీఐ మరోసారి నా ఆఫీసుకు వచ్చింది. వారిని నేను సాదరంగా ఆహ్వానించాను. గతంలో వారు మా ఇల్లు, కార్యాలయం, నా బ్యాంక్ లాకర్ను తనిఖీ చేశారు. మా గ్రామానికి వెళ్లి మరీ సోదాలు చేశారు. కానీ, అందులో నాకు వ్యతిరేకంగా వారికి ఏదీ లభించలేదు. ఇప్పుడు కూడా వారికి ఏం దొరకదు. ఎందుకంటే నేను ఏ తప్పూ చేయలేదు. ఢిల్లీలో చిన్నారులకు ఉత్తమ విద్య అందించేందుకు నిజాయితీగా పనిచేస్తున్నా అని సిసోడియా ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు.
అయితే, విచారణలో భాగంగా ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా కార్యాలయం నుంచి సీబీఐ కంప్యూటర్ను స్వాధీనం చేసుకుంది. అంతేగానీ, ఆయన కార్యాలయంలో ఎలాంటి సోదాలు చేయలేదని సీబీఐ వర్గాలు స్పష్టం చేశాయి.
కాగా, ఢిల్లీ లిక్కర్ కేసులో సిసోడియాపై ఆరోపణలు రావడంతో గత ఆగస్టులో ఆయన నివాసంతోపాటు కార్యాలయంలోనూ సీబీఐ సోదాలు చేసిన విషయం తెలిసిందే. ఢిల్లీ విద్యా శాఖతోపాటు ఎక్సైజ్ శాఖ బాధ్యతలను కూడా సిసోడియానే చూసుకుంటున్నారు. అయితే, సిసోడియా తీసుకొచ్చిన నూతన ఎక్సైజ్ విధానంపై ఆరోపణలు రావడంతో లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా సిఫార్సు మేరకు సీబీఐ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తోంది.