CBSE Board Exam 2021 : తగ్గించిన సిలబస్తోనే 10వ, 12వ తరగతి పరీక్షలు: కేంద్ర విద్యా మంత్రి
కరోనా విలయం కారణంగా ప్రస్తుత విద్యా సంవత్సరం తీవ్రంగా ప్రభావితమైంది. ఇప్పటికీ కొన్ని రాష్ట్రాల్లో స్కూళ్ల రీఓపెనింగ్ పై సందిగ్ధం కొనసాగుతున్నది. ఇక కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని స్కూళ్లలో కీలకమైన సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు, పలు పోటీ పరీక్షలకు సంబంధించి కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ సోమవారం కీలక ప్రకటన చేశారు.
సీబీఎస్ఈ పరీక్షలతో పాటు జేఈఈ మెయిన్, నీట్ వంటి పోటీ పరీక్షలు తగ్గించిన సిలబస్తోనే ఉంటాయని కేంద్ర విద్యా మంత్రి స్పష్టంచేశారు. సోమవారం కేంద్రీయ విద్యాలయాల విద్యార్థులతో నిర్వహించిన వెబినార్లో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. సీబీఎస్ఈ బోర్డు పరీక్షల గురించి ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సూచించారు. దేశంలో కరోనా భయం నెలకొన్న వేళ పరీక్ష కేంద్రాలకు వెళ్లడంపై ఓ విద్యార్థి ఆందోళన వ్యక్తంచేస్తూ అడిగిన ప్రశ్నకు ఆయన స్పందించారు.

పరీక్షలు చుట్టూ ఉన్న అంశాలపై భయపడాలి గానీ.. పరీక్షా కేంద్రాలకు వెళ్లడంపై ఆందోళనే అవసరం లేదని భరోసా ఇచ్చారు. గతేడాది నీట్ పరీక్షను విజయవంతంగా నిర్వహించామని ఆయన గుర్తుచేశారు. విద్యార్థులకు పరీక్ష కేంద్రానికి వెళ్లడంపై ఎలాంటి టెన్షన్ అవసరం లేదన్నారు. నూతన జాతీయ విద్యా విధానం -2020, పరీక్షలు, పాఠశాలల పునఃప్రారంభం తదితర అంశాలపై ఆయన విద్యార్థులతో చర్చించారు.
కేంద్రీయ విద్యాలయాల్లో తరగతులను దశలవారీగా పునఃప్రారంభిస్తామని మంత్రి అన్నారు. సగం మంది విద్యార్థులు తరగతులకు హాజరైతే.. మిగతా సగం మందికి ఆన్లైన్లో తరగతులు ఉండేలా నిర్వహిస్తామన్నారు. సీబీఎస్ఈలో ఈ ఏడాది తగ్గించిన సిలబస్ ఆధారంగానే పోటీ పరీక్షలకు ప్రశ్నలు అడుగుతారా? అని ఓ విద్యార్థి అడిగిన ప్రశ్నకు మంత్రి స్పందించారు.
సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు, జేఈఈ మెయిన్ 2021, నీట్ 2021 పరీక్షలకు తగ్గించిన సిలబస్ నుంచే ప్రశ్నలు ఉంటాయని స్పష్టంచేశారు. ఆయా పరీక్షలకు సవరించిన సిలబస్ ఆధారంగానే విద్యార్థులు అధ్యయనం చేయాల్సి ఉంటుందన్నారు. ఆ భాగం నుంచి మాత్రమే ప్రశ్నలు ఉంటాయని స్పష్టంచేశారు. సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు మే 4 నుంచి ప్రారంభమవుతాయని పోఖ్రియాల్ ప్రకటించిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications