కరోనా కొత్త హాట్స్పాట్స్గా సీబీఎస్ఈ పరీక్షా కేంద్రాలు: అవసరమా?: కేజ్రీవాల్ షాకింగ్ కామెంట్స్
న్యూఢిల్లీ: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకెండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) నిర్వహించే వార్షిక పరీక్షల గడువు ముంచుకొస్తోంది. వచ్చేనెలలో 10వ తరగతి, ఆపై పరీక్షలను నిర్వహించడానికి అధికార యంత్రాంగం సమాయాత్తమౌతోంది. అదే సమయంలో ప్రాణాంతక కరోనా వైరస్ పాజిటివ్ కేసుల్లో కనివినీ ఎరుగని రీతిలో పుట్టుకొస్తోండటం తల్లిదండ్రుల్లో తీవ్ర భయాందోళనలకు కారణమౌతోంది. పరీక్షలను రాయడానికి సిద్దపడుతోన్న విద్యార్థులనూ కలవరపాటుకు గురి చేస్తోంది. ఈ పరిస్థితుల్లో సీబీఎస్ఈ పరీక్షలను రద్దు చేయాలనే డిమాండ్ ఊపందుకుంటోంది. ఈ దిశగా పలు రాజకీయ పార్టీలు కేంద్రానికి విజ్ఙప్తులను పంపిస్తున్నాయి.
నో ఛేంజ్..దేశంలో అదే ఉధృతి: మళ్లీ లక్షా 60 వేలకు పైగా కరోనా కేసులు
తాజాగా ఆమ్ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా కేంద్రానికి ఇదే విజ్ఞప్తిని చేశారు. పరీక్షలను రాసే వాతావరణం లేదని పేర్కొన్నారు. కరోనా వైరస్ కేసులు అనూహ్యంగా పెరుగుతున్నాయని, ఈ పరిస్థితుల్లో లక్షలాది మంది విద్యార్థులు, ఉపాధ్యాయుల ఆరోగ్యం, ప్రాణాలను దృష్టిలో ఉంచుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఒక్క ఢిల్లీ పరిధిలోనే ఆరు లక్షల మందికి పైగా విద్యార్థులు సీబీఎస్ఈ పరీక్షలను రాయాల్సి వస్తోందని పేర్కొన్నారు. అలాగే లక్షమంది ఉపాధ్యాయులు విధి నిర్వహణలో పాల్గొనాల్సి ఉంటుందని చెప్పారు.
ఇన్ని లక్షలమంది ఒకేసారి పరీక్షలు రాయడానికి వెళితే.. ఆయా కేంద్రాలన్నీ కొత్తగా కరోనా వైరస్ హాట్స్పాట్స్గామారుతాయని కేజ్రీవాల్ ఆందోళన వ్యక్తం చేశారు. లక్షలాది మంది విద్యార్థులు, ఉపాధ్యాయుల ప్రాణాలు, ఆరోగ్యాన్ని పరిగణనలోకి తీసుకోవాలని ఆయన కేంద్ర ప్రభుత్వానికి విజ్ఙప్తి చేశారు. సీబీఎస్ఈ పరీక్షలను రద్దు చేయాలని కోరారు. లేదా ప్రత్యామ్నాయ మార్గాల్లో వాటిని నిర్వహించాలని అన్నారు. ఆన్లైన్ లేదా పరీక్షలను నిర్వహించడమో లేక అంతర్గత అసెస్మెంట్ ద్వారా విద్యార్థులకు మార్కులను వేయడమో చేయాలని చెప్పారు. పరీక్షలను రద్దు చేయడమే మేలని అన్నారు.
ఢిల్లీలో గత ఏడాది నవంబర్లో అత్యధికంగా ఒక్కరోజులో 8,500 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని, సెకెండ్ వేవ్ పరిస్థితుల్లో ఇప్పటికే రోజూ 13,500లకు పైగా కొత్త కేసులు రికార్డవుతున్నాయని కేజ్రీవాల్ పేర్కొన్నారు. గత రెండువారాలుగా అందుతోన్న నివేదికలను బట్టి చూస్తే..అత్యంత ప్రమాదకరమైన వాతావరణం నెలకొని ఉందనేది స్పష్టమౌతుందని చెప్పారు. కరోనా బారిన పడుతున్న వారిలో 65 శాతం మందికి పైగా 45 సంవత్సరాల లోపు ఉన్నవారేనని అన్నారు. ఈ పరిస్థితుల మధ్య పరీక్షలను సజావుగా నిర్వహించడం కష్టసాధ్యమని ఆయన స్పష్టం చేశారు.