ర్యాన్ స్కూల్ ఘటన: కీలకమైన సీసీటీవి పుటేజీ స్వాథీనం, ఏమైందంటే?
న్యూఢిల్లీ: దేశంలో సంచలనం సృష్టించిన గురుగ్రామ్ బాలుడి హత్య కేసులో కీలకమైన సీసీటీవి పుటేజీని పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు. చనిపోయేముందు బాలుడి చివరిక్షణాలు భయానకంగా ఉన్నాయని పోలీసులు చెప్పారు.
చనిపోయే సమయంలో రక్తపుమడుగులో ఏడేళ్ళ విద్యార్థి ప్రద్యుమ్నన్ కొట్టుకొంటున్న దృశ్యాలను చూసి చలించిపోయామని పోలీసులు చెప్పారు.
గుర్గావ్ ర్యాన్ ఇంటర్నేషనల్ స్కూల్లో రెండో తరగతి చదువుతున్న ఏడేళ్ళ బాలుడు ప్రద్యుమన్ ఠాకూర్ దారుణ హత్యకు గురయ్యాడు.ఈ ఘటనపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన నిర్వహించారు. ఈ ఆందోళన హింసాత్మకంగా మారడంతో గత ఆదివారం నాడు పోలీసులు ఆందోళనకారులపై లాఠీచార్జీ చేశారు.
ఈ బాలుడి హత్యపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. ప్రస్తుతం ఈ కేసును అన్ని కోణాల్లో విచారిస్తున్నట్టు పోలీసులు చెప్పారు. తొలుత బాలుడు వాష్రూమ్లోకి వెళ్ళాడు. కొద్దిసేపటికే బస్ కండక్టర్ ఆశోక్కుమార్ అదే వాష్రూమ్లోకి వెళ్ళాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే ఆశోక్ బయటకు వెళ్ళిపోయాడు. ఆశోక్ వెళ్ళిపోయిన తర్వాత ప్రద్యుమన్ మెడపై, గొంతుపై గాయాలతో పాకుతూ బయటకు వచ్చాడు. వాష్రూమ్ డోర్ వద్దే కుప్పకూలి చనిపోయాడు. అధికంగా రక్తస్రావం కావడంతో చనిపోయినట్టుగా వైద్యులు ప్రకటించారు.