దూసుకొచ్చిన మృత్యువు: 30అడుగుల దూరంలో ఎగిరిపడి తల్లీకూతురు మృతి (వీడియో)
మృత్యువు ఏ రూపంలో వస్తుందో ఎవరికీ తెలియదు. ఇంటి నుంచి బయటికెళితే.. తిరిగి ఇంటికి వచ్చే వరకూ మనుషుల ప్రాణాలకు గ్యారంటీ లేకుండా పోయింది. ఇటీవల కాలంలో చోటు చేసుకుంటున్న ప్రమాదాలతో ఈ పరిస్థితి నెలకొంది.
పుణె: మృత్యువు ఏ రూపంలో వస్తుందో ఎవరికీ తెలియదు. ఇంటి నుంచి బయటికెళితే.. తిరిగి ఇంటికి వచ్చే వరకూ మనుషుల ప్రాణాలకు గ్యారంటీ లేకుండా పోయింది. ఇటీవల కాలంలో చోటు చేసుకుంటున్న ప్రమాదాలతో ఈ పరిస్థితి నెలకొంది. తాజాగా, ఓ రెండు కుటుంబాలు ఏదో పని మీద బయటికి వచ్చాయి. రహదారి దాటేందుకు రోడ్డు మధ్య వరకూ వచ్చి డివైడర్ వద్ద నిల్చోగా ఓ కారు వేగంగా దూసుకచ్చి వారి పైనుంచి వెళ్లింది. ఈ ప్రమాదంలో తల్లీకూతుళ్లు మృతి చెందగా, మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది.
మహారాష్ట్రలోని పుణెలో జరిగిన ఈ ప్రమాదం సమీపంలోని సీసీ కెమెరాలో నమోదైంది. వివరాల్లోకి వెళితే.. పుణెలో ఐదుగురు వ్యక్తులు రోడ్డు దాటుతూ మధ్యలో వచ్చిన డివైడర్పై నిలబడ్డారు. పూజా విశ్వకర్మ అనే మహిళ, ఆమె కుమార్తె ఇషాతో పాటు మరో ముగ్గురు రోడ్డు దాటేందుకు వచ్చారు. మధ్యలో డివైడర్పై నిలబడి ఉండగా అతివేగంతో వచ్చిన ఓ కారు ఆ ఐదుగురి పైనుంచి దూసుకెళ్లింది.
ఈ ప్రమాదంలో ఇద్దరు 30 అడుగుల దూరం ఎగిరిపడగా, మరో ఇద్దరు కారు కిందపడి నలిగిపోయారు. చిన్నారి ఇషా అక్కడికక్కడే మృతిచెందగా, ఆమె తల్లి పూజా విశ్వకర్మ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందారు. గాయపడిన ముగ్గురు సాజిద్ షేక్, అతని సోదరి నిషా, అతని నాలుగేళ్ల కుమారుడు సయీద్ అలీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెప్పారు.
ప్రమాదానికి కారణమైన కారును సుజాతా ష్రాఫ్ అనే మహిళ నడిపినట్లు పోలీసులు చెప్పారు. ఒక్కసారిగా కళ్లు తిరగడంతో కారును అదుపు చేయలేకపోయానని సుజాత పోలీసులకు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, ప్రమాదానికి కారణమైన సుజాతను అరెస్ట్ చేశారు.












Click it and Unblock the Notifications