కాంగ్రెస్ను ఊడ్చేసిన చీపురు: ఢిల్లీ గడపను దాటి ఆమ్ ఆద్మీ: సీఎం అభ్యర్థి ఇంటివద్ద సీన్ ఇదీ
న్యూఢిల్లీ: ఊహించినట్టే- ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సారథ్యంలోని ఆమ్ ఆద్మీ పార్టీ సత్తా చాటింది. తన పరిదిని విస్తరించుకుంది. మొదటిసారిగా ఢిల్లీ గడపను దాటింది. పొరుగునే ఉన్న పంజాబ్లో పాగా వేసింది. భారీ ఆధిక్యతలో దూసుకెళ్తోందా పార్టీ. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను మించిపోయేలా అసెంబ్లీ నియోజకవర్గాలను తన ఖాతాలో వేసుకునేలా కనిపిస్తోంది ఆమ్ ఆద్మీ పార్టీ. ఈ పరిణామాలు ఆ పార్టీ నాయకులు, కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపాయి.

ఎగ్జిట్ పోల్స్ కంటే..
పంజాబ్లో ఆమ్ఆద్మీ పార్టీ అధికారంలోకి వస్తుందంటూ- ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసిన విషయం తెలిసిందే. అసెంబ్లీ ఫలితాలు వెలువడనున్న అయిదింట్లో- కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రం ఇదొక్కటే. ఇప్పుడీ రాష్ట్రం కాంగ్రెస్ చేతుల్లో నుంచి జారిపోవడం ఖాయమనే అభిప్రాయాలు ఉన్నాయి. ప్రతిపక్ష స్థానానికే పరిమితమౌతుందంటూ ఎగ్జిట్ పోల్స్ తేల్చిచెప్పాయి. ఇప్పుడు అదే నిజమవుతోంది. కాంగ్రెస్ పార్టీ తన పట్టు కోల్పోయినట్టే కనిపిస్తోంది.

86 స్థానాల్లో..
పంజాబ్ అసెంబ్లీలో ఉన్న సీట్ల సంఖ్య 117. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన మేజిక్ ఫిగర్ 59. దీన్ని ఆమ్ ఆద్మీ పార్టీ అందుకుంటుందని ఎగ్జిట్ పోల్స్ పేర్కొన్నాయి. 60 నుంచి 67 సీట్లను సాధిస్తుందని తేల్చాయి. అధికారంలోకి రావడానికి అవసరమైనన్ని స్థానాలకు కాంగ్రెస్ ఆమడదూరంలో నిలుస్తుందని, 40 నుంచి 50 సీట్లకు పరిమితమౌతుందంటూ ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేశాయి. ఇప్పుడున్న ట్రెండ్ చూస్తోంటే ఆమ్ ఆద్మీ పార్టీ మరిన్ని నియోజకవర్గాలపై జెండా పాతేలా ఉంది.

కాంగ్రెస్ 14 చోట్ల..
ప్రస్తుతం 86 నియోజకవర్గాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థులు భారీ ఆధిక్యతలో కొనసాగుతున్నారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుు 14 స్థానాల్లో ఆధిక్యతలో ఉన్నారు. శిరోమణి అకాలీదళ్ మూడో స్థానంలో నిలిచింది. 11 చోట్ల అకాలీదళ్ అభ్యర్థులు ముందంజలో కొనసాగుతున్నారు. ఓట్ల లెక్కింపు కొనసాగుతున్న కొద్దీ- ఈ ఆధిక్యత తారుమారయ్యే అవకాశాలు లేకపోలేదు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన సంఖ్యాబలం కంటే అధిక స్థానాలను గెలచుకునేలా ఉన్న నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ నేతల్లో జోష్ నెలకొంది.

ఓట్ల శాతం ఇలా..
ఆమ్ ఆద్మీ పార్టీ 42 ఓట్ల శాతాన్ని సాధించిందంటే- దాని ప్రభంజనం ఏ స్థాయిలో ఉందో ఊహించుకోవచ్చు. మొన్నటిదాకా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఓట్ల శాతం 23 మాత్రమే. 23 ఓట్ల శాతాన్ని మాత్రమే పొందడం ఖాయంగా కనిపిస్తోంది కాంగ్రెస్ పార్టీ. శిరోమణి అకాలీదళ్ 18, భారతీయ జనతా పార్టీ ఆరు శాతం ఓట్లకే పరిమితం అయ్యాయి.
ముఖ్యమంత్రి అభ్యర్థి నివాసం వద్ద
ఆప్ ముఖ్యమంత్రి అభ్యర్థి, సంగ్రూర్ లోక్సభ సభ్యుడు భగవంత్ మాన్ నివాసం వద్ద పండగ వాతావరణం నెలకొంది. ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో ఆయన నివాసానికి చేరుకుంటోన్నారు. డ్రమ్ములను మోగిస్తూ హోరెత్తిస్తోన్నారు. రంగులను చల్లుకుంటోన్నారు. స్వీట్లను పంచిపెడుతున్నారు. ఆకాశమే హద్దుగా సంబరాలను జరుపుకొంటోన్నార. భగవంత్ మాన్కు అభినందనలతో ముంచెత్తుతున్నారు. తాను పోటీ చేసిన ధురి నియోజకవర్గంలో భగవంత్ ఆధిక్యతలో కొనసాగుతున్నారు.












Click it and Unblock the Notifications