కేబినెట్ బెర్తులు ఫైనల్..లిస్ట్ రెడీ: ఈ సాయంత్రమే మోడీ ముద్ర: ప్లస్సులూ, మైనస్సులు
న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ సారథ్యంలో కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ సంకీర్ణ సర్కార్లో మంత్రివర్గ విస్తరణకు సంబంధించిన చర్చలు జోరుగా సాగుతోన్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ నెలలోనే తన కేబినెట్ను విస్తరించడానికి ముహూర్తం దాదాపు ఫైనల్ అయినట్టే. దీనికి సంబంధించిన జాబితా సైతం దాదాపు సిద్ధమైంది. దీనికి సంబంధించిన కసరత్తు పూర్తయింది. ఈ సాయంత్రమే మోడీ ఈ జాబితాపై ఆమోదముద్ర వేస్తారనే ప్రచారం సాగుతోంది. కొందరు కొత్త ముఖాలకు మంత్రివర్గంలో బెర్త్ లభించనుంది. వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ, 2024 నాటి సాధారణ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ప్రధాని కొత్త టీమ్ను ఏర్పాటు చేసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.
అనంతపురంలో బయోటెక్ పార్క్ హబ్: ఇండస్ జీన్స్ వ్యాక్సిన్ల తయారీ యూనిట్
తండ్రి స్థానంలో తనయుడికి ఛాన్స్
లోక్జనశక్తి పార్టీ అధినేత, దివంగత కేంద్రమంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ కుమారుడు చిరాగ్ పాశ్వాన్కు కేబినెట్ బెర్త్ లభిస్తుందనే ప్రచారం ఉంది. రెండురోజుల కిందటే ఆయన ప్రధాని సొంత రాష్ట్రం గుజరాత్కు వెళ్లడం.. కొందరు బీజేపీ నేతలను కలుసుకోవడంతో ఈ ప్రచారం ముమ్మరమైంది. పశుపతి పాశ్వాన్ పార్టీని చీల్చిన తరువాత ఆయనకు ప్రారంభంలో బీజేపీ నుంచి ఎలాంటి సహకారం అందనప్పటికీ- గుజరాత్ వెళ్లొచ్చిన తరువాత పరిస్థితి మారింది. ఆయనను రామ్ విలాస్ పాశ్వాన్ స్థానాన్ని చిరాగ్ పాశ్వాన్తో భర్తీ చేయడం దాదాపు ఖాయమైందని జాతీయ మీడియా చెబుతోంది.
కర్ణాటక నుంచి ప్రతాప సింహ
కర్ణాటక నుంచి బీజేపీ లోక్సభ సభ్యుడు ప్రతాప సింహను కేంద్ర కేబినెట్లోకి తీసుకుంటారని సమాచారం. ప్రస్తుతం ఆయన మైసూరు లోక్సభ స్థానానికి ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్నారు. వరుసగా రెండుసార్లు ఆయన ఈ స్థానం నుంచి విజయం సాధించారు. 2014, 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను మట్టికరిపించారు. మైసూరు లోక్సభ నియోజకవర్గం స్థానంపై కాంగ్రెస్, జనతాదళ్ (సెక్యులర్)కు కొద్దో గొప్పో ఉన్న పట్టును తుడిచిపెట్టేయడంతో పాటు బీజేపీ బలోపేతం కావడానికి ప్రతాప సింహ శ్రమించారనే పేరుంది. దీనితో పాటు- వాగ్ధాటి, వివిధ అంశాలపై ఉన్న అవగాహనను దృష్టిలో ఉంచుకుని ఆయనకు బెర్త్ ఇస్తారని తెలుస్తోంది.
కాంగ్రెస్ మాజీ ఎంపీకీ
కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలం పాటు కొనసాగిన జ్యోతిరాదిత్య సింధియాకు కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకోవడం ఖాయమైంది. ఆ హామీతోనే ఆయన భారతీయ జనతా పార్టీ తీర్థాన్ని పుచ్చుకున్నారు. పార్టీలో చేరిన కొద్దిరోజులకే బీజేపీ ఆయనను రాజ్యసభకు నామినేట్ చేసింది. హిమంత బిశ్వశర్మ కోసం తన ముఖ్యమంత్రి పదవిని త్యాగం చేసిన అస్సాం మాజీ సీఎం శర్బానంద సొనొవాల్ పేరు తుది జాబితాలో చేర్చినట్లు తెలుస్తోంది. ఉత్తర ప్రదేశ్ నుంచి రాజ్యసభకు ఎంపికైన జీవీఎల్ నరసింహారావు పేరు సైతం విస్తృతంగా వినిపిస్తోంది.
Recommended Video
ఈ సాయంత్రమే మోడీ కీలక భేటీ..
ఈ పరిస్థితుల మధ్య మోడీ- ఈ సాయంత్రం కీలక భేటీ నిర్వహించనున్నారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్రమంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, నిర్మల సీతారామన్, ధర్మేంద్ర ప్రధాన్, ప్రహ్లాద్ జోషి, పియూష్ గోయెల్, నరేంద్ర సింగ్ తోమర్లతో సాయంత్రం 5 గంటలకు సమావేశం కానున్నారు. పనితీరు ఆధారంగా ప్లస్సులు, మైనస్సుల మీదే ప్రధానంగా చర్చ సాగుతుంది. ఆశించిన స్థాయిలో రాణించలేని కొందరు మంత్రులకు ఉద్వాసన తప్పకపోవచ్చని సమాచారం. తుది జాబితాపై ఆమోదముద్ర వేసిన వెంటనే ఒకట్రెండు రోజుల్లో మంత్రివర్గ విస్తరణకు ప్రధాని పూనుకుంటారని తెలుస్తోంది.