ఇకపై ఓటు వేయక తప్పదు..! సాధ్యాసాధ్యాలపై కేంద్ర ఎన్నికల సంఘం సర్వే

హైదరాబాద్ : మీరు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారా? ఈవీఎంలపై నమ్మకముందా? ఎవరైనా భయపెడితే ఓటు వేస్తున్నారా? ఏ పార్టీకైనా సానుభూతిపరులుగా ఉన్నారా? ఓటింగ్ తగ్గిపోవడానికి కారణాలేంటి? ఇంటి పెద్దలు, మత పెద్దలు చెబితే ఓటేస్తున్నారా? ఇవన్నీ కూడా మేము అడిగే ప్రశ్నలు కాదు. కేంద్ర ఎన్నికల సంఘం ఓటర్లను అడగనున్న ప్రశ్నల జాబితా. ఇలాంటి అనేక విషయాలతో దేశవ్యాప్త సర్వేకు శ్రీకారం చుట్టింది. ఓటర్ల నమోదు ప్రక్రియ నుంచి మొదలుపెట్టి.. ఓటు వేసేంత వరకు అనేక అంశాలపై అభిప్రాయాలను సేకరించనుంది.

ఓటింగ్ సర్వే

ఓటింగ్ సర్వే

ఓటు హక్కు వినియోగంపై పెద్దఎత్తున ప్రచారం చేస్తున్నా.. ఓటింగ్ శాతం మాత్రం పెరగడం లేదు. దీనిపై కసరత్తు చేసిన కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల క్రతువుపై సర్వే చేయించడానికి సిద్ధమైంది. ఓటర్ల నుంచి వివిధ అంశాలకు సంబంధించి సమాచారం సేకరించనుంది. దేశవ్యాప్తంగా శ్రీకారం చుట్టిన సీఈసీ.. అన్ని రాష్ట్రాల్లో వీలైనంత త్వరగా సర్వే ప్రక్రియ పూర్తిచేయించనుంది. ఎన్నికలు స్వేచ్ఛాయుత వాతావరణంలో జరుగుతున్నాయా? ఓటింగ్ ను తప్పనిసరి చేస్తే ఎలా ఉంటుంది? ఎన్నికల్లో అర్ధ, అంగ బలం పెరుగుతున్నాయని అనుకుంటున్నారా? గత ఎన్నికల్లో ఓటు వేశారా? ఈ ఎన్నికల్లో ఓటు హక్కు ఉందా? ఇలా కేంద్ర ఎన్నికల సంఘం ప్రశ్నల పరంపర కురిపించనుంది.

 ఏపీలో షురూ.. త్వరలో తెలంగాణ

ఏపీలో షురూ.. త్వరలో తెలంగాణ

లోక్‌సభ ఎన్నికలకు ముందు తెరపైకి వచ్చిన ఈ సర్వే.. ఆంధ్రప్రదేశ్ సహా కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే ప్రారంభమైంది. తెలంగాణలో త్వరలోనే సర్వే నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఏపీలోని తిరుపతి, అనంతపురం, విశాఖపట్నం, విజయవాడ, నరసరావుపేట, విజయనగరం పార్లమెంటరీ సెగ్మెంట్లలో 3 అసెంబ్లీ నియోజకవర్గాలను ఎంపిక చేశారు. అందులో ఎక్కువ ఓట్లు వచ్చిన గ్రామాలతో పాటు తక్కువ ఓట్లు పోలయిన గ్రామాలను ఈ సర్వే కోసం ఎన్నుకున్నారు. మొత్తం 17వేల మంది నుంచి అభిప్రాయాలను సేకరించనున్నారు.

సర్వేకు సంబంధించి 18 పేజీల సర్వే పత్రం తయారుచేయించింది కేంద్ర ఎన్నికల సంఘం. టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ వారు రూపొందించిన ఈ సర్వే పత్రంలో ఓటర్ల నుంచి నమోదు చేయాల్సిన వివరాల మేరకు ప్రశ్నలున్నాయి. అన్నీ రాష్ట్రాల్లో ఈ సర్వే వీలైనంత త్వరగా పూర్తి చేయించాలని రాష్ట్ర ఎన్నికల సంఘాలను ఆదేశించింది సీఈసీ. దీంతో ఏపీ, తెలంగాణలో సర్వే బాధ్యతను ఆర్థిక, సామాజిక అధ్యయనాల సంస్థ సెస్ కు అప్పగించారు.

 ఓటర్ల నాడి దొరికేనా?

ఓటర్ల నాడి దొరికేనా?

ఓటింగ్ శాతం పెంచాలనే సాధ్యాసాధ్యాలపై కేంద్ర ఎన్నికల సంఘం చేపడుతున్న ఈ సర్వేపై ఓటర్లు ఎలా స్పందిస్తారో అనేది ప్రశ్నార్థకమే. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 18 పేజీల సర్వే పత్రం పూర్తిగా నింపడానికి ఓటర్లు సహకరిస్తారా? అనే అనుమానాలు లేకపోలేదు. ఇక ఏ పార్టీకి సానుభూతిపరులు లాంటి ప్రశ్నలు కొంత ఇబ్బందికరంగా ఉండటం.. అలాంటి వాటికి ఓటర్లు కచ్చితమైన సమాధానం చెబుతారని ఆశించడం సరికాదేమో. మొత్తానికి ఓటింగ్ పై అవగాహన పెంచేలా సీఈసీ చేపట్టిన ఈ సర్వే అభినందనీయమే అయినప్పటికీ.. ఓటర్లు ఎలా రిసీవ్ చేసుకుంటారో మరి. ఎన్నికల వేళ ఓటర్ల నాడి దొరకక నేతలే తర్జనభర్జన పడుతుంటారు. అలాంటిది కేంద్ర ఎన్నికల సంఘం సర్వేకు.. వారి పల్స్ ఎంతవరకు దొరుకుతుందో చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+