వందే భారత్ రైళ్లపై కేంద్రం గుడ్ న్యూస్-102 సెమీ హైస్పీడ్ సర్వీసులు ఎప్పటినుంచో తెలుసా ?
భారత్ లో స్వదేశీ తయారీ వందే భారత్ రైళ్ల ప్రారంభంపై ఇవాళ కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. ఈ స్వదేశీ సెమీ హైస్పీడ్ రైళ్లు ఎప్పటి నుంచి పరుగులు పెట్టబోతున్నాయో కేంద్రం వెల్లడించింది. ఇందుకోసం కేంద్రం చేస్తున్న ప్రయత్నాలను కూడా తెలిపింది. దీంతో వందే భారత్ రైళ్లపై ప్రయాణికుల్లో ఆసక్తి మరింత పెరిగినట్లయింది.
భారత్ లో హైస్పీడ్ రైళ్లను పరుగులు తీయించడానికి చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా స్వదేశంలో తయారు చేస్తున్న వందే భారత్ రైళ్లను త్వరలో పట్టాలెక్కించడానికి కేంద్రం ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా మొత్తం 102 సెమీ హైస్పీడ్ రైళ్లను అందుబాటులోకి తెస్తున్నట్లు కేంద్రం తెలిపింది. అయితే ఇవి 2024 మార్చి నాటికి దేశవ్యాప్తంగా వివిధ రూట్లలో అందుబాటులోకి వస్తాయని కేంద్రం వెల్లడించింది.

తాజాగా ప్రధాని మోడీ భారత దేశానికి స్వాతంత్రం లభించి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా దేశవ్యాప్తంగా 75 వందే భారత్ రైళ్లను అందుబాటులోకి తెస్తున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో రైల్వేశాఖ 58 ర్యాక్ లకు టెండర్లు ఆహ్వనించింది. ఒక్కో ర్యాక్ లో భాగంగా 16 కోచ్ లు ఉంటాయి. తాజాగా వీటి సంఖ్యను 102కు పెంచిన నేపథ్యంలో మరో 44 ర్యాక్ లకు టెండర్లు ఆహ్వానిస్తోంది. చెన్నైలోని రైల్వే కోచ్ ఫ్యాక్టరీలోనే ఈ కోచ్ లు రూపుదిద్దుకోనున్నాయి.

వాస్తవానికి ప్రస్తుతం భారత్ లో పరుగులు తీస్తున్న రైళ్ల కంటే వేగంగా 160 కిలోమీటర్ల వేగం అంటే సెమీ హైస్పీడ్ వేగంతో నడిచే ట్రైన్ 18ని ముందుగా ఆవిష్కరించారు. దీనికే వందే భారత్ రైలుగా పేరు పెట్టారు. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారయ్యే ఈ రైళ్లు భారతీయ రైల్వేల్ని ప్రపంచంలోనే మరో మెట్టు ఎక్కిస్తాయని భావిస్తున్నారు. ఈ రైళ్ల రాక కోసం ప్రయాణికులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇలాంటి సమయంలో కేంద్రం నుంచి వెలువడిన ప్రకటన వీరిలో ఉత్సాహం నింపుతోంది. ఈ వందే భారత్ రైళ్లు విజయవంతమైతే మేకిన్ ఇండియా ప్రాజెక్టులకు మరింత ఊతం లభిస్తుందని కేంద్రం కూడా గంపెడాశలు పెట్టుకుంది.












Click it and Unblock the Notifications