భారత్లో కరోనా టీకాలు ముందుగా వారికే- 30 కోట్ల మంది గుర్తింపు- నాలుగు కేటగిరీల్లో..
దేశంలో కరోనా వ్యాక్సిన్ను వచ్చే ఏడాది ఆరంభం నాటికి అందుబాటులోకి తెస్తామని చెబుతున్న కేంద్ర ప్రభుత్వం దీన్ని ముందుగా ఎవరికి అందించాలనే విషయంలో ఓ భారీ ప్రణాళిక సిద్ధం చేస్తోంది. దీని ప్రకారం కోవిడ్ బాధితుల్లో కీలకమైన, క్లిష్ట సమస్యలు ఎదుర్కొంటున్న వారికి ముందుగా ఇచ్చేందుకు వీలుగా ఓ ప్లాన్ రెడీ చేసింది. దీని ప్రకారం వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహించేందుకు కేంద్రం ఏర్పాట్లు చేస్తోంది. దీన్ని పకడ్బందీగా అమలు చేసేందుకు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల సహకారం కోరుతోంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే జనవరి లేదా ఫిబ్రవరిలో వ్యాక్సిన్ రాగానే ముందుగా వీరికి అందిస్తారు.
కరోనా రోగి మృతదేహానికి పోస్ట్ మార్టం.. 18గంటల పాటు జీవించే ఉన్న వైరస్ , లెదర్ బంతిలా ఊపిరితిత్తులు
ముందుగా కరోనా వ్యాక్సిన్ వీరికే...
భారత్లో వచ్చే ఏడాది జనవరి లేదా ఫిబ్రవరి నాటికి కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి తెస్తామని చెబుతున్న కేంద్ర ప్రభుత్వం నిరంతరం ఆయా పరిశోధనా సంస్ధలతో సంప్రదింపులు జరుపుతోంది. అదే సమయంలో వ్యాక్సిన్ రాగానే తొలి దశలో ఇవ్వాల్సిన వారిని గుర్తించే ప్రక్రియ ప్రారంభించింది. తొలిదశలో ఎవరికి వ్యాక్సిన్ ఇవ్వాల్సి ఉంటుందనే విషయంలో నిరంతరం రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలతో సంప్రదింపులు జరుపుతున్న కేంద్ర ప్రభుత్వం.. ముందుగా 30 కోట్ల మంది లబ్దిదారులను గుర్తిస్తున్నట్లు తెలుస్తోంది. వీరికి కరోనా వ్యాక్సినేషన్ కింద ఓ కార్యక్రమం నిర్వహించి టీకాలు ఇవ్వబోతోంది. అదే సమయంలో రాష్ట్రాలు మరో జాబితాను తయారు చేయొద్దని కేంద్రం కోరింది.
నాలుగు కేటగిరీలుగా విభజన..
తొలిదశలో వ్యాక్సిన్ ఇవ్వాల్సిన వారిని నాలుగు కేటగిరీలుగా కేంద్రం విభజించింది. ఇందులో కోటి మంది హెల్త్ కేర్ నిపుణులు, డాక్టర్లు, ఎంబీబీఎస్ విద్యార్ధులు, నర్సులు, ఆశావర్కర్లు ఉన్నారు. అలాగే రెండో కేటగిరీలో 2 కోట్ల మంది పారిశుద్ధ్య సిబ్బంది, పోలీసులు, ఆర్మీ బలగాలు వంటి ఫ్రంట్లైన్ వర్కర్లు ఉన్నారు. ఆ తర్వాత మూడో కేటగిరీలో 26 కోట్ల మంది 50 ఏళ్లు దాటిన వృద్ధులున్నారు. మిగిలిన నాలుగో కేటగిరీలో 50 ఏళ్లు కంటే తక్కువగా ఉన్నప్పటికీ వివిధ దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్నవారికి ఈ వ్యాక్సిన్ అందించబోతున్నారు. ఆ తర్వాత రెండో దశలో మిగిలిన వారికి వ్యాక్సిన్ ఇచ్చేందుకు కేంద్రం మొగ్గు చూపనుంది.
Recommended Video
నవంబర్ నాటికి జాబితా రెడీ...
కరోనా వ్యాక్సిన్ రాగానే ముందుగా ఇవ్వాల్సిన 30 కోట్ల మందిని గుర్తించేందుకు కేంద్రం రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్ సహకారంతో ఓ జాబితా సిద్ధం చేస్తోంది. బాధితులు, రోగుల ఆధార్ కార్డుల ఆధారంగా ఈ జాబితాను సిద్ధం చేయాలని ఇప్పటికే కేంద్రం నుంచి ఆదేశాలు అందాయి. ఈ జాబితాను నవంబర్ చివరి లోగా సిద్ధం చేయాలని కేంద్రం కోరుతోంది. నవంబర్ చివరి నాటికి డేటా వస్తే డిసెంబర్లో ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే చేసి జనవరిలో తుది జాబితా సిద్ధం చేయాలని కేంద్రం భావిస్తోంది. అప్పుడు వారికి టీకాలు అందించేందుదుకు సులువవుతుందని అంచనా వేస్తోంది. ప్రస్తుతం ఉన్న యూనివర్సన్ ఇమ్యూనైజేషన్ ప్రోగ్రామ్ డేటాలో మార్పులు చేర్పులు ఉంటే చేసి తుది జాబితా ఇవ్వాలని రాష్ట్రాలకు కేంద్రం సూచించింది.