కేంద్రం ఎన్నికల సంస్కరణలు- ఆధార్-ఓటు లింక్, ఓట్ల నమోదుకు ఏటా 4 ఛాన్స్ లు
దేశవ్యాప్తంగా మారుతున్న పరిస్దితులకు అనుగుణంలో ఎన్నికల వ్యవస్ధలో సంస్కరణలు రావడం లేదు. దీంతో నకిలీ ఓటర్లు పెరగడం, ఇతరత్రా అవకతవకలు జరగడం, అంతిమంగా ఎన్నికల నిర్వహణ ప్రజాస్వామ్యయుతంగా జరగకపోవడం చూస్తున్నాం. దీంతో ఇప్పుడు వాటిలో పలు మార్పులు చేయడం ద్వారా ప్రక్షాళన చేపట్టేందుకు కేంద్రం సిద్ధమైంది. ఈ దిశగా ఇవాళ సమావేశమైన కేంద్ర కేబినెట్ నాలుగు ఎన్నికల సంస్కరణలకు ఆమోదం తెలిపింది.

ఎన్నికల సంస్కరణలు
కేంద్ర ఎన్నికల సంఘం సిఫారసుల ఆధారంగా దేశంలో ఎన్నికల ప్రక్రియను సంస్కరించేందుకు కీలక సవరణలు తీసుకొస్తున్నట్లు కేంద్రం ఇవాళ ప్రకటించింది. ఓటర్ల జాబితాను బలోపేతం చేయడానికి, ఓటింగ్ ప్రక్రియను మరింత మెరుగుపర్చేందుకు, ఎన్నికల సంఘానికి మరింత అధికారాన్ని ఇవ్వడానికి, నకిలీలను తొలగించడానికి నాలుగు ప్రధాన సంస్కరణలు తీసుకొస్తోంది. ఈ పార్లమెంటు సమావేశాల్లోనే ఇందుకు సంబంధించి బిల్లులు ప్రవేశపెట్టనుంది.

ఓటరు కార్డుతో ఆధార్ లింక్
ఇప్పటివరకూ పాన్ కార్డును, ఆధార్ కార్డును మాత్రమే లింక్ చేస్తుండగా.. ఓటర్ కార్డు ఐడీని సైతం ఆధార్ కార్డుతో అనుసంధానించుున్నారు. అయితే ఇది గతంలో నిర్బంధంగా చేపట్టగా.. ఈసారి స్వచ్చంధంగా అమలు చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఎన్నికల సంఘం అంచనా ప్రకారం ఇప్పటివరకూ దీనిపై నిర్వహించిన పైలట్ ప్రాజెక్ట్లు సానుకూనంగా ఉన్నట్లు తేలింది. అలాగే విజయవంతమయ్యాయి కూడా. దీంతో నకిలీ ఓట్లను ఏరివేసేందుకు వీలు కలగనుంది.

ఓట్ల నమోదుకు మరిన్ని అవకాశాలు
అలాగే ఓటర్ల జాబితాలో తమ పేర్లను నమోదు చేసుకోవడానికి యువతకు మరిన్ని అవకాశాలు కల్పించాలని కేంద్రం నిర్ణయించింది. వచ్చే ఏడాది జనవరి 1 నుండి, 18 సంవత్సరాలు నిండిన మొదటి సారి ఓటర్లు నాలుగు వేర్వేరు కటాఫ్ తేదీలతో సంవత్సరానికి నాలుగు సార్లు నమోదు చేసుకునే అవకాశం ఉంటుంది. వారు ఇప్పటి వరకు సంవత్సరానికి ఒకసారి మాత్రమే నమోదు చేసుకునే వీలుంది. దీన్ని సవరించాలని కేంద్రం నిర్ణయించింది.

సర్వీస్ ఓటర్లకు ఊరట
దేశంలో సైన్యం సహా సర్వీసు ఓటర్ల కుటుంబాలకు ఓటు హక్కు విషయంలో ఇప్పటివరకూ పలు ఆంక్షలు ఉన్నాయి. వాటిని తొలగించాలని కేంద్రం నిర్ణయించింది. సర్వీస్ ఆఫీసర్ల భర్తకు కూడా ఓటు వేసేందుకు అనుమతిస్తూ, సర్వీస్ ఆఫీసర్ల కోసం చట్టాన్ని లింగ భేదాల్లేకుండా చేయాలని కూడా ఎన్నికల సంఘం ఇప్పటికే నిర్ణయించింది. ప్రస్తుత చట్టం ప్రకారం, ఈ సదుపాయం కేవలం పురుష సర్వీస్ ఓటరు భార్యకు మాత్రమే అందుబాటులో ఉంది. ఇకపై మహిళా సర్వీస్ ఓటరు భర్తకు కూడా దీన్ని అందుబాటులోకి తెస్తున్నారు.
Recommended Video

ఈసీకి మరిన్ని అధికారాలు
ఎన్నికల సమయంలో ఎన్నికల నిర్వహణ కోసం దేశంలో ఏదైనా ప్రాంగణాన్ని స్వాధీనం చేసుకోవడానికి అవసరమైన అన్ని అధికారాలను కూడా ఎన్నికల సంఘానికి ఇస్తూ మరో సంస్కరణను కేంద్రం తీసుకురానుంది. ఎన్నికల సమయంలో పాఠశాలలు, ఇతర ముఖ్యమైన సంస్థలను స్వాధీనం చేసుకోవడంపై కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి. దీంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ప్రభుత్వం ఈ కీలక ఎన్నికల సంస్కరణలను ప్రవేశపెట్టనుంది












Click it and Unblock the Notifications