3500పోర్న్ సైట్లు బ్లాక్: సుప్రీంకు తెలిపిన కేంద్రం..
ఇంటర్నెట్, స్మార్ట్ ఫోన్ వినియోగం పెరిగిన తర్వాత పోర్న్ మార్కెట్ విస్తృతి కూడా విపరీతంగా పెరిగిపోయింది. ముఖ్యంగా టీనేజర్ల మెదళ్లను తొలుస్తున్న పోర్న్.. వారిని దారి తప్పేలా ప్రభావితం చేస్తోంది.
న్యూఢిల్లీ: ఇంటర్నెట్, స్మార్ట్ ఫోన్ వినియోగం పెరిగిన తర్వాత పోర్న్ మార్కెట్ విస్తృతి కూడా విపరీతంగా పెరిగిపోయింది. ముఖ్యంగా టీనేజర్ల మెదళ్లను తొలుస్తున్న పోర్న్.. వారిని దారి తప్పేలా ప్రభావితం చేస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా కేంద్ర ప్రభుత్వం 3500 అశ్లీల వెబ్సైట్లను బ్లాక్ చేసింది.
ఈ మేరకు శుక్రవారం కేంద్రప్రభుత్వం సుప్రీంకోర్టుకు వివరాలు అందజేసింది. బ్లాక్ చేసిన వెబ్ సైట్లను పాఠశాలల్లో జామర్ల ఏర్పాటు ద్వారా నిలిపివేయాలని సీబీఎస్ఈని కోరినట్లు జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ధర్మాసనానికి కేంద్రం తెలిపింది.
దీనిపై స్పందించిన అడిషనల్ సొలిసిటర్ జనరల్ పింకీ ఆనంద్..పాఠశాల బస్సుల్లో జామర్లు ఏర్పాటుచేయడం కుదరదని కోర్టుకు తెలిపారు. జామర్ల ఏర్పాటు కాకుండా.. అశ్లీల వెబ్ సైట్లను నిషేధించడానికి తగిన చర్యలు తీసుకుంటామన్నారు. బస్సుల్లో జామర్లు ఏర్పాటు చేయడం కుదరకపోవడంతో.. పాఠశాలల్లో ఏర్పాటు చేయాలని సీబీఎస్ఈ అధికారులకు సూచించినట్లు తెలిపారు.
అశ్లీల సైట్లను బ్లాక్ చేసేందుకు తీసుకున్న చర్యలపై న్యాయస్థానానికి స్టేటస్ రిపోర్టు సమర్పిస్తామని పేర్కొన్నారు. దీంతో రెండు రోజుల్లోగా రిపోర్టు సమర్పించాలని సుప్రీం ధర్మాసనం తెలిపింది.