డ్యూటీలో ఉన్న పోలీసుల ఆరోగ్యం జర భద్రం..! రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంతాలకు హోంశాఖ ఆదేశాలు..!!
ఢిల్లీ/హైదరాబాద్ : కరోనా వైరస్ మహమ్మారి కట్టడి, ప్రజల స్వీయ నియంత్రణ, లాక్ డౌన్ ఆంక్షల అమలులో పోలీసుల కృషి వెలకట్టలేదని కేంద్ర హోంశాఖ భావిస్తోంది. విధి నిర్వహణలో భాగంగా పోలీసులు నిత్యం రోడ్ల మీద విధులు నిర్వహిస్తున్నారని, అలాంటి తరుణంలో వారి ఆరోగ్య భద్రతను కూడా పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుందని కేంద్ర హోం శాఖ స్పష్టం చేస్తోంది. విధులు నిర్వహిస్తున్నప్పుడు పోలీసు సిబ్బంది విషయంలో అప్రమత్తంగా ఉండాలంటూ కేంద్ర హోంశాఖ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరించింది.
ఈసారి కూడా టీడిపి జెండా పండుగ లేనట్టే..! మహానాడుపై కన్నెర్ర చేసిన కరోనా..!!
దేశంలోని పలు ప్రాంతాల్లో ప్రమాదకర పరిస్థితుల్లో విధులు నిర్వహిస్తోన్న పోలీసు సిబ్బంది కరోనా బారిన పడుతుండటంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాల్సిన అవసరం ఉందని కేంద్ర హోంశాఖ కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈమేరకు ప్రత్యామ్నాయ ప్రణాళికలతో రాష్ట్రాలన్నీ సిద్ధం కావాలని కేంద్ర హోంశాఖ రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు హెచ్చరికలు జారీ చేసింది.
ఇదే అంశాలను పొందుపరుస్తూ కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ కుమార్ రాష్ట్ర డీజీపీలకు లేఖ రాసినట్లు సమాచారం. కరోనా వైరస్ నియంత్రణకు సంబంధించి సుదీర్ఘకాలం పోరాటం చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని హోంశాఖ అంచనా వేస్తోంది. లాక్డౌన్ మరో నెల, రెండు నెలలు కొనసాగే పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో పోలీసు సిబ్బంది ఆరోగ్య పరిస్థితుల పట్ల అప్పమత్తంగా వ్యవహరించాలని రాష్ట్ర డిజిపిలకు హోంశాఖ సూచించింది.
పోలీసు సిబ్బందిని రెండుగా విభజించి వారిలో కొంతమందిని విధినిర్వహణలో ఉంచాలని, మరికొందరిని అదనపు ఉద్యోగులుగా ఉపయోగించుకోవాలని, వారికి వర్క్ ఫ్రమ్ హోమ్ సౌకర్యం కల్పించాలని హోంశాఖ సూచించింది. ఈ మేరకు సెకండ్ లైన్ భద్రతా సిబ్బందిని విధి నిర్వహణ కోసం సిద్ధం చేయాలని, ప్రస్తుత కరోనా క్లిష్ట సమయంలో పరిస్థితులను అదిగమించేవరకూ రాష్ట్ర పోలీసు విభాగాలు ప్రత్యామ్నాయ ప్రణాళికలతో సిద్ధం కావాలని కేంద్ర హోంశాఖ తెలిపింది.