ఆక్సిజన్ రెడీ పెట్టుకోండి- చైనా నుంచి వస్తే టెస్టులే- రాష్ట్రాలకు కేంద్రం తాజా అలర్ట్..
దేశవ్యాప్తంగా చైనా వైరస్ ఒమిక్రాన్ బీఎఫ్ 7 ముప్పుపెరుగుతోంది.ఇప్పటికే దేశంలో వందలాది మంది చైనా నుంచి ఈ వైరస్ ను తెచ్చి ఉంటారని భావిస్తున్న కేంద్రం.. రాష్ట్రాల్ని అప్రమత్తం చేస్తోంది. ఇందులో భాగంగా నిరంతరం పరిస్దితిని సమీక్షిస్తూ ఎప్పటికప్పుడు అలర్ట్ లు పంపుతోంది. ఇవాళ కూడా ఆరు పాయింట్లతో కూడిన అలర్ట్ ను కేంద్రం రాష్ట్రాలకు పంపింది.
కేంద్రం రాష్ట్రాలకు పంపిన తాజా అలర్ట్ లో ఆక్సిజన్ నిల్వలు సరిచూసుకోవాలని సూచించింది. కరోనా రెండో వేవ్ సమయంలో ఆక్సిజన్ అందక వేల మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో రాష్ట్రప్రభుత్వాలు ఈసారి కూడా ఆక్సిజన్ నిల్వలు ఉంచుకోవాలని కేంద్రం ఆదేశించింది. అలాగే చైనా నుంచి వచ్చే ప్రతీ ఒక్కరికీ కరోనా టెస్టుుల తప్పనిసరి చేయాలని కేంద్రం కోరింది. చైనా నుంచి వచ్చే ప్రయాణికుల్ని ముందుగా క్వారంటైన్ కు పంపాలని, అక్కడ తప్పనిసరిగా కోవిడ్ టెస్టులు చేయాలని సూచించింది.
దేశంలో కోవిడ్ కేసులు ప్రస్తుతానికి తక్కువగా ఉన్నప్పటికీ, భవిష్యత్తులో తలెత్తే ఎలాంటి సవాళ్లను అయినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ఆరోగ్యశాఖ రాష్ట్రాల్ని కోరింది. ఈ వైద్య మౌలిక సదుపాయాల నిర్వహణచాలా ముఖ్యమైనదని ఆరోగ్య మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి మనోహర్ అగ్నాని రాష్ట్రాలకు రాసిన లేఖలో పేర్కొన్నారు. మెడికల్ ఆక్సిజన్ నిర్వహణపై చేసిన సూచనలో PSA ప్లాంట్లను పూర్తిగా పని చేసేలా ఉంచాలని, వాటిని తనిఖీ చేయడానికి సాధారణ మాక్ డ్రిల్లు చేయాలని కోరింది.