తెలుగు రాష్ట్రాల్లో ధాన్యం కొనుగోళ్లపై పార్లమెంటులో కేంద్రం క్లారిటీ-టీఆర్ఎస్ నిరసనలు
ఏపీ, తెలంగాణలో ధాన్యం కొనుగోళ్ల అంశం ఇవాళ పార్లమెంటులో చర్చకు వచ్చింది. టీడీపీ ఎంపీ కేశినేని నాని కేంద్రాన్ని దీనిపై ప్రశ్నించారు. తెలుగు రాష్ట్రాల్లో ధాన్యం కొనుగోళ్ల కోసం కేంద్రం తీసుకుంటున్న చర్యల్ని ఆయన ప్రశ్నించారు. దీంతో కేంద్రం ధాన్యం కొనుగోళ్లపై క్లారిటీ ఇచ్చింది.
తెలుగు రాష్ట్రాల్లో ధాన్యం కొనుగోళ్లపై లోక్ సభలో టీడీపీ ఎంపీ కేశినేని నాని అడిగిన ప్రశ్నపై కేంద్రం స్పందించింది. 2018-19 సీజన్లో ఏపీ నుంచి 48.06 మెట్రిక్ టన్నులు, తెలంగాణ నుంచి 51.90 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించినట్లు కేంద్రం వెల్లడించింది. అలాగే 2019-20లో ఏపీ నుంచి 55.33 మెట్రిక్ టన్నులు, తెలంగాణ నుంచి 74.54 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించినట్లు తెలిపింది. తాజాగా 2020-21 సీజన్లోనూ ఏపీ నుంచి 56.67 మెట్రిక్ టన్నులు, తెలంగాణ నుంచి 94.53 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు కేంద్రం లోక్ సభలో వెల్లడించింది.
అలాగే ఫుడ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా ఆస్తుల అమ్మకంపైనా కేంద్రం క్లారిటీ ఇచ్చింది. ప్రైవేటీకరణలో భాగంగా ఎఫ్ సీ ఐ ఆస్తుల్ని అమ్మడం లేదని కేంద్రం లోక్ సభలో వెల్లడించింది. మరోవైపు ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం విధానం మార్చుకోవాలని, తాజా వివరాలు వెల్లడించాలని కోరుతూ లోక్ సభలో టీఆర్ఎస్ ఎంపీలు నిరసనకు దిగారు. ఉదయం నుంచి సభా కార్యకలాపాలకు అడ్డు తగిలారు. స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టి నినాదాలు చేశారు. అయినా సభ అంతరాయాల మధ్య కార్యకలాపాలు కొనసాగించింది. వచ్చే సీజన్లో ధాన్యం వేయకపోవడమే మంచిదంటూ కేంద్రం ఇప్పటికే ఇచ్చిన క్లారిటీతో తెలంగాణ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. ఇక్కడి రైతులకు నచ్చజెప్పేందుకు టీఆర్ఎస్ ప్రయత్నిస్తున్నా సాధ్యం కావడం లేదు. దీంతో కేంద్రం విధానం మార్చుకోవాలంటూ టీఆర్ఎస్ నిరసనలకు దిగుతోంది. అయినా కేంద్రం స్పందించే పరిస్ధితులు కనిపించడం లేదు.
మరోవైపు తాజాగా కేంద్రంతో చర్చల కోసం మందీమార్బలంతో ఢిల్లీ వెళ్లిన తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా ఒట్టి చేతులతో తిరిగొచ్చారు. ధాన్యం కొనుగోళ్లపై వెనక్కి తగ్గేందుకు కేంద్రం సిద్ధంగాలేదని తేలిపోవడంతో పార్లమెంటులో టీఆర్ఎస్ నిరసనలతో రైతుల దృష్టిని ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నారు.