రోహింగ్యా శరణార్థుల వేలిముద్రలను కేంద్రం సేకరిస్తుంది: రాజ్నాథ్ సింగ్
దేశంలోకి వస్తున్న రోహింగ్యా శరణార్థుల వేలిముద్రలను విధిగా తీసుకోవాలని సూచించారు కేంద్రహోంశాఖ మంత్రి ఆదేశించారు. అంతేకాదు ఇప్పటికే ఆయా రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేశామని వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వేలిముద్రలు సేకరించిన తర్వాత కేంద్రప్రభుత్వం మయన్మార్ ప్రభుత్వానికి పంపుతుందని తెలిపారు. దీని ద్వారా రోహింగ్యా సమస్యకు చెక్ పెట్టొచ్చన్నారు.
భద్రతా అంశాలు, అంతర్ రాష్ట్ర సంబంధాలు, మావోయిస్టుల అంశాలపై కోల్కతాలో చర్చించారు. ఈ సమావేశానికి పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా హాజరయ్యారు. జార్ఖండ్ ముఖ్యమంత్రి రఘుభర్ దాస్, బీహార్ డిప్యూటీ సీఎం సుశీల్ మోడీ, ఒడిషా ఆర్థికశాఖ మంత్రి శశి భూషణ్ బెహెరాలు హాజరయ్యారు. రోహింగ్యా కుటుంబాలు కేరళలో మకాం వేస్తున్నాయని వీరిపై ఓ కన్నేసి ఉంచాలని రైల్వే అధికారులు కేరళ ప్రభుత్వ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకొచ్చారు. మయన్మార్కు చెందిన రోహింగ్యా శరణార్థులు 14 రైళ్లలో ఆయా రాష్ట్రాల నుంచి ఈశాన్య రాష్ట్రాలకు వెళుతున్నారని రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు.
దక్షిణ రైల్వే ఛీఫ్ సెక్యూరిటీ కమిషనర్ రోహింగ్యాలు ఆయా రాష్ట్రాలకు రైళ్లలో వెళుతున్నట్లు ఆయా డివిజినల్ సెక్యూరిటీ కమిషనర్లకు లేఖ రాసింది. ఇందులో భాగంగా చెన్నై, మదురై, సేలం, తిరువనంతపురం, పాలక్కడ్, తిరుచిరపల్లి భద్రతాధికారులకు లేఖ రాశారు. అయితే రోహింగ్యా శరణార్థులను గుర్తిస్తే వారిని పోలీసులకు అప్పజెప్పాలని అధికారులు సూచించారు. ఈ మధ్యకాలంలో రోహింగ్యాల సమస్య కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తలనొప్పిగా తయారైంది. కొందరు రోహింగ్యాలుగా పేర్కొంటూ ఎన్ఆర్సీలో పేర్లను తొలగించారు. అయితే వాస్తవానికి వారు అస్సోం పౌరులే కావడం విశేషం. ఇది పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది.