పార్లమెంట్ ప్రత్యేక భేటీలో జమిలి ఎన్నికల బిల్లు ? ఆ వెంటనే ముందస్తుకు వ్యూహం!
భారత్ లో జమిలి ఎన్నికల నిర్వహణకు కేంద్రం వేగంగా పావులు కదుపుతోంది. ఇప్పటికే లాకమిషన్ అధ్యయనం పూర్తి కావడంతో దీనిపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకునే దిశగా అడుగులేస్తోంది. అలాగే ఎన్నికల కమిషన్ ను కూడా జమిలి ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని ఇప్పటికే సంకేతాలు కూడా పంపింది. ఈ నేపథ్యంలో త్వరలో జరిగే పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో జమిలి ఎన్నికల బిల్లు పెట్టేందుకు సిద్ధమవుతున్నట్లు ఢిల్లీలో ప్రచారం జరుగుతోంది.
సెప్టెంబరు 18 నుంచి 22 వరకు జరిగే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో కేంద్రం 'ఒక దేశం, ఒకే ఎన్నికలు' బిల్లును ప్రవేశపెట్టవచ్చని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. 'వన్ నేషన్, వన్ ఎలక్షన్' అనేది లోక్సభ ఎన్నికలు, వివిధ రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలనే ఆలోచనకు అనుగుణంగా రూపుదిద్దుకుంటోంది. ఈ ఆలోచన గతంలో చాలాసార్లు ప్రస్తావనకు వచ్చినా సాధ్యం కాలేదు. లా కమిషన్ ఆఫ్ ఇండియా కూడా దీనిపై అధ్యయనం పూర్తి చేయడంతో కేంద్రం దీనిపై ముందడుగు వేసేందుకు అవకాశం లభించింది.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా లోక్సభ లేదా రాష్ట్రాల అసెంబ్లీలయినా ఎన్నికలు సాధారణంగా వాటి గడువు ముగిసిన తర్వాత జరుగుతున్నాయి. ఇది సాధారణంగా ప్రతి సంవత్సరం రెండు ఎన్నికల చక్రాలుగా జరుగుతోంది. ఒక్కో సైకిల్ వివిధ రాష్ట్రాల అసెంబ్లీలకు ఓటింగ్ని సూచిస్తోంది. కానీ వన్ నేషన్, వన్ ఎలక్షన్ ప్రకారం లోక్సభతో పాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకే సారి ఎన్నికలు జరుగుతాయి. అలాగే ఓటింగ్ కూడా ఒకే రోజు జరిగేలా ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి.
పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో వన్ నేషన్-వన్ ఎలక్షన్ బిల్లు పెట్టి కేంద్రం ఆమోదించుకుంటే ఆ తర్వాత ముందస్తు ఎన్నికలకూ మార్గం సుగమం అవుతుందని భావిస్తున్నారు. ఎందుకంటే ముందస్తు ఎన్నికలపై ఇప్పటికే పలు రాజకీయ పార్టీల్లో చర్చ జరుగుతోంది. అయితే కేంద్రం ఉద్దేశం మాత్రం స్పష్టం కావడం లేదు. ఈ నేపథ్యంలో జమిలి ఎన్నికల బిల్లు పార్లమెంట్ ఆమోదం పొందితే ఈ ఏడాది చివర్లో జరిగే పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటు వచ్చే ఏడాది, ఆ తర్వాత జరిగే ఎన్నికలు కూడా ముందుకు జరపవచ్చని కేంద్రం భావిస్తోంది.












Click it and Unblock the Notifications