ఆ అయిదు దేశాల నుంచి వచ్చే వారికి కొత్త నిబంధనలు- నెగెటివ్ రిపోర్ట్ ఉంటేనే?
న్యూఢిల్లీ: చైనాను అతలాకుతలం చేస్తోన్న ప్రమాదకరమైన కరోనా వైరస్ బీఎఫ్ 7 వేరియంట్ పాజిటివ్ కేసులు దేశంలో నమోదవుతున్నాయి. విదేశాల నుంచి వచ్చిన వారిలో 39 మంది ఈ మహమ్మారి బారిన పడ్డారు. క్రమంగా ఈ సంఖ్య పెరుగుతోంది. తాజాగా ముంబైలోని ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చిన విదేశీ ప్రయాణికుల్లో ఇద్దరు కరోనా వైరస్ పాజిటివ్గా తేలారు. వారి శాంపిళ్లను జీనోమ్ సీక్వెన్స్ కోసం పంపించినట్లు మహారాష్ట్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.
వచ్చే 40 రోజులు అత్యంత గడ్డుకాలం- విస్పష్ట ప్రకటన చేసిన కేంద్రం..!!
యాక్టివ్ కేసుల్లో పెరుగుదల..
అటు దేశవ్యాప్తంగా యాక్టివ్ కేసుల సంఖ్య 3,468కి చేరింది. గతంలో ఈ సంఖ్య నామమాత్రంగా ఉండేది. ఇప్పటివరకు దేశంలో నమోదైన మొత్తం కోవిడ్ మరణాల సంఖ్య 5,30,696గా నమోదైంది. శరవేగంగా వ్యాప్తి చెందే లక్షణాలు ఉన్న బీఎఫ్ 7 వేరియంట్ కావడం వల్ల తక్షణమే ముందు జాగ్రత్త చర్యలకు దిగింది కేంద్ర ప్రభుత్వం. కోవిడ్ మార్గదర్శకాలను జారీ చేసింది. కొత్త సంవత్సరం, వైకుంఠ ఏకాదశి, సంక్రాంతి పండగ సీజన్ ఆరంభం కాబోతోన్నందున అప్రమత్తంగా ఉండాలనీ సూచించింది.
ఎయిర్ సువిధ..
అదే సమయంలో విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులు పెద్ద సంఖ్యలో కరోనా వైరస్ బారిన పడుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో వారిపై నిఘా పెంచింది కేంద్ర ప్రభుత్వం. ఇప్పటికే ఎయిర్ సువిధ వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందులో తమ వివరాలన్నింటినీ పొందుపర్చాల్సి ఉంటుందని తెలిపింది. విదేశాల నుంచి భారత్కు వచ్చే ప్రతి ప్రయాణికుడు కూడా ఎయిర్ సువిధలో తమ వివరాలను రిజిస్టర్ చేయించుకోవాల్సి ఉంటుంది.
ఆ అయిదు దేశాలివే..
అదే సమయంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతోన్న దేశాల నుంచి వచ్చే ప్రయాణికుల కోసం కొత్త నియమ నిబంధనలను ప్రవేశపెట్టనుంది కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ. చైనా, జపాన్, దక్షిణ కొరియా, హాంకాంగ్, థాయ్లాండ్ ను ఈ జాబితాలో చేర్చింది. ఈ అయిదు దేశాల నుంచి భారత్కు వచ్చే వారికి ఆర్టీపీసీఆర్ నెగెటివ్ రిపోర్టులను తప్పనిసరి చేయనుంది. దీనికి సంబంధించిన ఉత్తర్వులు త్వరలో వెలువడే అవకాశం ఉంది.
మధ్య జనవరి నుంచి..
వచ్చే 40 రోజులు అత్యంత గడ్డుకాలంగా పరిణమిస్తుందని కేంద్ర ప్రభుత్వం అంచనా వేసింది. జనవరి రెండోవారం నుంచి దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరిగే ప్రమాదం లేకపోలేదని స్పష్టం చేసింది. తూర్పు ఆసియా దేశాల్లో ప్రవేశించిన 30 నుంచి 35 రోజుల వ్యవధిలో కోవిడ్ వేవ్ దేశాన్ని తాకిందని వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు చెబుతున్నాయి. అవే లెక్కలను పరిగణనలోకి తీసుకుంటే ఇప్పుడు కూడా వచ్చే 40 రోజుల్లో ఈ కోవిడ్ వేవ్ భారత్ను తాకే ప్రమాదం లేకపోలేదని స్పష్టం చేస్తోన్నాయి.