హిట్లర్లా కేంద్రం.. గ్యాస్ చాంబర్లు ఒక్కటే తక్కువ: శివసేన ఫైర్
నేషనల్ హెరాల్డ్కు సంబంధించి మనీ లాండరింగ్ కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని ఈడీ విచారిస్తోంది. అయితే దీనిపై కాంగ్రెస్ శ్రేణులు నిరసనలు చేపడుతున్నాయి. దీనిని శివసేన కూడా ఖండించారు. రాహుల్ గాంధీని నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో ఈడీ విచారిస్తుండడం పట్ల శివసేన పార్టీ నిప్పులు చెరిగింది. పార్టీ పత్రిక 'సామ్నా' సంపాదకీయంలో కేంద్రంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది.
దివంగత కాంగ్రెస్ నేతలు జవహర్ లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీల స్మృతులను చెరిపివేయాలనుకుంటుందని మండిపడింది. నెహ్రూ, ఇందిరల వారసుల భవిష్యత్తును కూడా కాలరాసేందుకు ప్రయత్నిస్తోందని శివసేన ఆరోపించింది. రాహుల్ గాంధీపై విచారణ ద్వారా, తాను ఎవరి కాలర్ అయినా పట్టుకోగలనని కేంద్రం భావిస్తోందని పేర్కొంది.
ఇవాళ రాహుల్ గాంధీ, సోనియా గాంధీ... రేపు ఇంకెవరైనా కావొచ్చు! నాడు హిట్లర్ తన శత్రువులను అంతమొందించేందుకు గ్యాస్ చాంబర్లు నిర్మించాడు. ఇప్పుడీ కేంద్ర ప్రభుత్వం తీరు చూస్తుంటే గ్యాస్ చాంబర్లు నిర్మించడం ఒక్కటే తక్కువ అన్నట్టు ఉందని ఫైరయ్యింది. ఇది చట్టం యొక్క సమానత్వం అనిపించుకుంటుందా అని విమర్శనాస్త్రాలు సంధించింది. కేంద్రానిది అధికార దురంహకారం అని పేర్కొంది.