ఆర్మీ రిక్రూట్ మెంట్ కు కేంద్రం కొత్త మోడల్-ఐదేళ్లలో సగం సైనికుల రిటైర్మెంట్
దేశవ్యాప్తంగా చేపడుతున్న ఆర్మీ ఎంపిక విధానంలో మార్పుల కోసం కేంద్రం ప్రతిపాదిస్తున్న ఓ కొత్త విధానం సంచలనంగా మారబోతోంది. ఈ విధానం అమల్లోకి వస్తే సైన్యంలో భారీగా సైనికులు రిటైర్ కావడంతో పాటు కొత్త సమస్యలూ తలెత్తబోతున్నట్లు తెలుస్తోంది. గతేడాది ప్రతిపాదించిన ఈ విధానం ఇంకా అమల్లోకి రావాల్సి ఉంది.
కేంద్రం ఆర్మీ ఎంపిక కోసం ప్రతిపాదిస్తున్న టూర్ ఆఫ్ డ్యూటీ విధానం అమల్లోకి వస్తే కేవలం ఐదేళ్ల వ్యవధిలోనే దాదాపు సగం మంది సైనికులు రిటైర్ కావడం ఖాయమని తెలుస్తోంది. గతేడాది ఆర్మీ అధికారుల ఖాళీల భర్తీ కోసం ప్రతిపాదించిన ఈ విధానం ఇప్పుడు సైనికులకు మాత్రమే వర్తింపచేయాలని కేంద్రం నిర్ణయించడమే ఇందుకు కారణం. పెరుగుతున్న రక్షణ శాఖ పెన్షన్ బిల్లులను పరిష్కరించే సమయంలో ఆర్మీలో అధికారుల కొరతను తగ్గించే ఉద్దేశ్యంతో గతేడాది తొలిసారి దీన్ని కేంద్రం ప్రతిపాదించింది. ఈ అర్మీ రిక్రూట్మెంట్ మోడల్ స్వల్పకాలిక కాంట్రాక్ట్ ప్రాతిపదికన సైనికులను మాత్రమే రిక్రూట్ చేసేలా సవరించనున్నారు.
గతేడాది కోవిడ్-19 మహమ్మారి విజృంభించిన తర్వాత ఆర్మీలో సైనికుల నియామక ప్రక్రియ రెండేళ్ల క్రితం నిలిపివేశారు. రక్షణ దళాలలో చేరేందుకు ఆశావహులు రిక్రూట్మెంట్ ర్యాలీల సస్పెన్షన్కు వ్యతిరేకంగా తాజాగా జంతర్ మంతర్ వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించారు. టూర్ ఆఫ్ డ్యూటీ (ToD) అని పిలిచే ప్రతిపాదిత రిక్రూట్మెంట్ మోడల్ చివరి దశలో ఉందని, రెండు వారాలుగా దీనిపై జరిగిన అనేక సమావేశాల్లో పురోగతి ఉందని కేంద్రం చెబుతోంది. ఈ పథకం ప్రస్తుత ముసాయిదా ప్రకారం, భారత సైన్యంలోని సైనికులందరినీ టూర్ ఆఫ్ డ్యూటీ మోడల్ కింద రిక్రూట్ చేస్తారు. వీరిలో 25% మంది ఆర్మీలో మూడేళ్లపాటు, 25% మంది సైనికులు ఐదేళ్లపాటు సేవలందిస్తారు.ఆ తర్వాత వీరు రిటైర్ అవుతారు. మిగిలిన 50% మంది తమ పదవీ విరమణ వయస్సు వచ్చే వరకు పూర్తి కాలానికి ఆర్మీలో కొనసాగుతారు. ఇది రక్షణ పెన్షన్ బిల్లుల్ని భారీగా తగ్గిస్తుందని కేంద్రం అంచనా వేస్తోంది.
మూడు, ఐదు సంవత్సరాల ముగింపులో విడుదలయ్యే 50% మంది సైనికులను జాతీయ పెన్షన్ పథకంలో చేర్చి, నిర్ణీత కాలానికి సాయుధ దళాల సీనియర్లకు వర్తించే నిర్దిష్ట వైద్య ప్రయోజనాలను అందించాలని కూడా ఈ పథకంలో ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదిత రిక్రూట్మెంట్ మోడల్ అధికారులకు వర్తించకపోవచ్చని తెలుస్తోంది. అలాగే దీని కింద సైనికులను మాత్రమే నియమించుకోవచ్చని సమాచారం. గతేడాది డిసెంబర్లో పార్లమెంట్లో సమర్పించిన సమాచారం ప్రకారం సైన్యంలో 7,476 మంది అధికారుల కొరత ఉంది.ఈ ప్రతిపాదన ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందనే సమాచారం ఇంకా అందుబాటులో లేదని తెలుస్తోంది.