తారాజువ్వల్లా నిత్యావసర సరుకుల రేట్లు: కేంద్రం తాజా నివేదికలో సైతం
దేశంలో నిత్యావసర వస్తువుల ధరలు సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నాయి. పప్పులు, కూరగాయలు సహా ఇతర ఆహార పదార్థాల ధరలు అనూహ్యంగా పెరిగిపోతున్నాయి. ఈ ఏడాది ఆగస్టులో దేశీయ రిటైల్ ద్రవ్యోల్బణం 4.82 శాతానికి చేరింది. జూలైలో ఇది 4.45 శాతం మాత్రమే. కేంద్ర స్టాటిస్టిక్స్ మంత్రిత్వ శాఖ కొద్దిసేపటి కిందటే కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ను విడుదల చేసింది. రిటైల్ ద్రవ్యోల్బణానికి సంబంధించిన వివరాలను ఇందులో పొందుపరిచింది.
ఆహార పదార్థాల ధరలు.. ద్రవ్యోల్బణం పెరగడానికి ప్రధాన కారణాలయ్యాయి. కన్స్యూమర్ ఫుడ్ ప్రైస్ ఇండెక్స్ ద్వారా లెక్కించే ఆహార ద్రవ్యోల్బణం జూలై 5.52 శాతం నుండి ఆగస్టులో 5.95 శాతానికి ఎగబాకింది. నిత్యం వాడే ఉల్లిపాయ ధరలు భారీగా పెరిగాయి. ఉల్లి ద్రవ్యోల్బణం ఏకంగా 48.27 శాతానికి చేరింది. వెల్లుల్లి.. 43.60 శాతంగా నమోదైంది. అల్లం రేట్లల్లో కూడా 73.82 శాతం మేర పెరుగుదల కనిపించింది.

కొన్ని కూరగాయల ధరలు మాత్రం సామాన్యుడికి కాస్త ఉపశమనాన్ని ఇచ్చాయి. గత ఏడాదితో పోలిస్తే టమాటా ధరలు 31.09 శాతం తగ్గాయి. బంగాళాదుంప ధరలలో కూడా 13.14 శాతం తగ్గుదల నమోదైంది. వీటితో పాటు బెండకాయల ధరలు కూడా 5.41 శాతం తగ్గుముఖం పట్టాయి. ఈ కాలంలో వెండి ఆభరణాల ధరలు విపరీతంగా పెరిగి 107.11 శాతం ద్రవ్యోల్బణాన్ని నమోదు చేశాయి. బంగారం, ప్లాటినం ఆభరణాలు 35.53 శాతం వద్ద నిలిచాయి.
దేశంలోని వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో పోల్చితే తెలంగాణలో రిటైల్ ద్రవ్యోల్బణం అత్యధికంగా నమోదైంది. ఇక్కడ కంబైన్డ్ రిటైల్ ద్రవ్యోల్బణం రేటు గరిష్ఠంగా 6.27 శాతం. దీని తరువాత దాద్రా నగర్ హవేలీ 6.22 శాతంతో రెండో స్థానంలో నిలిచింది. ఏపీలో ద్రవ్యోల్బణం 5.53 శాతంగా నమోదైంది. తమిళనాడు ఈ సంఖ్య 5.92 శాతం కాగా దేశ రాజధానిలో అత్యల్పంగా 2.61 శాతం మాత్రమే నమోదు కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
పట్టణ ప్రాంతాలతో పోల్చుకుంటే గ్రామీణ భారతంలో ధరల ప్రభావం మరింత తీవ్రంగా ఉంది. ఆగస్టులో గ్రామీణ ద్రవ్యోల్బణం 5.23 శాతానికి పెరిగింది. పట్టణ ప్రాంతాల్లో ఈ రేటు 4.31 శాతంగా మాత్రమే. గ్రామీణ ప్రాంతాల్లోని ఆహార ద్రవ్యోల్బణం కూడా గరిష్ఠ స్థాయిలో 6.13 శాతానికి చేరుకుంది. దీనివల్ల పల్లెటూరి కుటుంబాలపై ధరల ప్రభావం భారీగా పడుతోంది.
ఆహార పదార్థాలతో పాటుగా ఇతర నిత్యావసర సేవలు కూడా ప్రియం అయ్యాయి. కాస్మటిక్స్ వంటి ఉత్పత్తుల కేటగిరీలో అత్యధికంగా 15.17 శాతం ద్రవ్యోల్బణం నమోదైంది. హోటళ్లు, రెస్టారెంట్ల సర్వీసుల రేట్లు 8.38 శాతం మేర పెరిగాయి. అలాగే రవాణా సేవల రేట్లు సైతం విపరీతంగా పెరిగాయి. జులైతో పోల్చుకుంటే ఆగస్టులో 4.60 శాతం మేర నమోదయ్యాయి. దుస్తులు పాదరక్షల విభాగంలో 3.56 శాతం చొప్పున ధరల పెరుగుదల కనిపించింది.
దేశంలో రిటైల్ ద్రవ్యోల్బణం వరుసగా మూడో నెలలోనూ పైపైకే వెళ్తోంది. ఈ ఏడాది మే లో 3.93 శాతంగా ఉన్న ఈ రేటు జూన్లో 4.38, జూలైలో 4.45, ఆగస్టులో 4.82 శాతానికి క్రమంగా పెరుగుతూ వచ్చింది. ఇది.. దేశంలో ధరల పెరుగుదల తీవ్రత ఏ స్థాయిలో ఉంటోందో అద్దం పట్టింది. ఎల్ నినో ప్రభావం వల్ల వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో.. ఈ ధరల పెరుగుదలకు ఇప్పట్లో బ్రేకులు పడకపోవచ్చు.















Click it and Unblock the Notifications
