కసబ్ను ఉంచిన బ్యారక్ లోకే మాల్యా?: లండన్ కోర్టుకు భారత్ నివేదిక..
ఇదే బ్యారక్ లో గతంలో 26/11 పేలుళ్ల సూత్రధారి, పాక్ ఉగ్రవాది అజ్మల్ కసబ్ శిక్ష అనుభవించడం గమనార్హం.
ముంబై: దాదాపు 9వేల కోట్ల రుణ ఎగవేతకు పాల్పడి లండన్లో తలదాచుకుంటున్న విజయ్ మాల్యాను ఎట్టకేలకు ఇండియా రప్పించే ప్రయత్నాలు వేగవంతమయ్యాయి. లండన్ కోర్టు మాల్యాను భారత్కు అప్పగించిన వెంటనే ఆయన్ను ముంబై జైలుకు తరలించనున్నట్లు తెలుస్తోంది.
ముంబైలోని ఆర్థర్ రోడ్ జైల్లో మాల్యాను ఉంచే అవకాశం ఉంది. ఇందుకోసం జైల్లోని బ్యారక్-12ను ఇప్పటికే సిద్దం చేసినట్లు చెబుతున్నారు. ఇదే బ్యారక్ లో గతంలో 26/11 పేలుళ్ల సూత్రధారి, పాక్ ఉగ్రవాది అజ్మల్ కసబ్ శిక్ష అనుభవించడం గమనార్హం.
ముంబై మహాలక్ష్మీ రేసుకోర్సుకు సమీపంలో ఉన్న అర్థర్ రోడ్ జైల్లో మాల్యాను ఉంచడానికి అవసరమైన అన్ని భద్రతా ప్రమాణాలున్నాయని లండన్ కోర్టుకు సమర్పించిన నివేదికలో ప్రభుత్వం పేర్కొంది.
జైలు అధికారులు రూపొందించిన ఈ నివేదికను ప్రభుత్వం సీబీఐ ద్వారా మాల్యా అప్పగింత కేసును విచారిస్తున్న వెస్ట్ మినిస్టర్ మెజిస్ట్రేట్ కోర్టుకు సమర్పించింది. కేంద్రం నివేదికతో లండన్ కోర్టు అప్పగింత ప్రక్రియను వేగవంతం చేస్తుందని అధికారులు భావిస్తున్నారు.