బొగ్గు కొరత లేదంటున్న కేంద్రం-20 ధర్మల్ పవర్ ప్లాంట్ల మూసివేత
దేశవ్యాప్తంగా బొగ్గు సంక్షోభం కొనసాగుతోంది. బొగ్గు కొరత కారణంగా పలు రాష్ట్రాల్లో విద్యుత్ ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం పడుతోంది. దీంతో పరిస్దితిని గాడినపెట్టేందుకు కేంద్రం తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. తాజాగా యూపీలో 14 ధర్మల్ విద్యుత్ ప్లాంట్లు మూతపడ్డాయి. ఈ నేపథ్యంలో తాజా పరిస్ధితిపై కేంద్రం స్పందించింది.
దేశవ్యాప్తంగా విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన బొగ్గు లభ్యత తగ్గిపోయిన నేపథ్యంలో కొరత తీవ్రమవుతోంది. అయితే కేంద్రం మాత్రం దేశంలో బొగ్గు కొరత లేదని చెబుతోంది. దేశంలో విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన బొగ్గు నిల్వలు అందుబాటులో ఉన్నట్లు చెబుతోంది. అయితే తాజాగా బొగ్గు కొరత కారణంగా పంజాబ్ లో మూడు విద్యుత్ ప్లాంట్లు, కేరళలో నాలుగు, మహారాష్ట్రలో 13 ధర్మల్ పవర్ ప్లాంట్లు మూతపడ్డాయి.. దీంతో కర్నాటక,పంజాబ్ ముఖ్యమంత్రులు బొగ్గు సరఫరా పెంచాలని తాజాగా కేంద్రాన్ని అభ్యర్దించారు.

దేశవ్యాప్తంగా బొగ్గు సంక్షోభంపై విపక్ష కాంగ్రెస్ మండిపడింది. కేంద్రంపై సూటిగా విమర్శలు గుప్పించింది. పెట్రోల్, డీజిల్ ధరల తర్వాత ఇప్పుడు బొగ్గు ధరలు కూడా పెరగబోతున్నాయని కాంగ్రెస్ విమర్శించింది. పంజాబ్, కర్నాటక, ఏపీతో పాటు పలు రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే బొగ్గు కొరతపై కేంద్రాన్ని నిలదీస్తున్నాయి. దీంతో కేంద్రం ఇరుకుపడింది. దేశంలో తగినన్ని బొగ్గు నిల్వలు ఉన్నాయని పైకి చెబుతున్నా.. వాటిని సరఫరా చేసే విషయంలో తలెత్తిన ఇబ్బందులతో విద్యుత్ ప్లాంట్లు మూతపడుతున్నాయి. దీంతో కేంద్రం మాటలకూ, చేతలకూ పొంతన లేకుండా పోతోంది.
బొగ్గు నిల్వల తాజా పరిస్ధితిపై కేంద్రం వరుస సమీక్షలు నిర్వహిస్తోంది. పలు రాష్ట్రాలో రెండు రోజులకు మించి బొగ్గు నిల్వలు లేవని వార్తలు వస్తున్న నేపథ్యంలో సరఫరా పెంచేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వవిభాగాలతో పాటు పలు రాష్ట్రాల అధికారులకు ఆదేశాలు వెళ్లాయి. కేంద్రం చర్యలతో ఇవాళ, రేపట్లో పరిస్ధితి కాస్త మెరుగుపడ వచ్చని తెలుస్తోంది. అయినా ఇప్పటికే మూతపడిన విద్యుత్ ప్లాంట్లను తెరిపించడం కూడా కష్టమేనని తెలుస్తోంది. దీంతో మరిన్ని ప్లాంట్లు మూతపడకుండా కేంద్రం తాజా మార్గదర్శకాలు కూడా విడుదల చేసింది.












Click it and Unblock the Notifications