తేల్చేసిన కేంద్రం... ఆ ప్రతిపాదన లేదు... ఇక ఇప్పట్లో పెట్రోల్,డీజిల్ ధరలు తగ్గవు...
అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు ఎంతగా పడిపోయినా భారత్లో మాత్రం ఇంధన ధరలు పైకి ఎగబాకడమే తప్ప కిందకు దిగుతున్న సూచనలు కనిపించట్లేదు. దీనికి గత ప్రభుత్వాలే కారణమని ప్రధాని మోదీ ఆరోపిస్తుంటే... పెట్రోలియంపై కేంద్రం 'మోదీ ట్యాక్స్' వసూలు చేస్తోందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. మరోవైపు ఆయా రాష్ట్రాల్లోని బీజేపీ నాయకత్వం... పెట్రోల్ ధరల పెరుగుదలకు రాష్ట్ర ప్రభుత్వాలే కారణమని ఆరోపిస్తున్నాయి. విమర్శలు,ఆరోపణల సంగతెలా ఉన్నా సామాన్యుడిపై ఈ భారం తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ నేపథ్యంలో ఇంధన ధరలపై వసూలు చేస్తున్న పన్నుపై తాజాగా పార్లమెంటులో కేంద్రం క్లారిటీ ఇచ్చింది.
Recommended Video
రూ.1300
కోట్లు
మీవే
కావొచ్చు:
ఈ
బుధవారమే
పవర్బాల్
లాటరీ..ఎలా
ఆడాలంటే..?
పన్నుపై క్లారిటీ ఇచ్చిన కేంద్రం...
మే 6,2020 నుంచి లీటర్ పెట్రోల్పై రూ.32,లీటర్ డీజిల్పై రూ.33 పన్ను వసూలు చేస్తున్నట్లు పార్లమెంటులో కేంద్రం స్పష్టం చేసింది.బేసిక్ ఎక్సైజ్ డ్యూటీ,సెస్,సర్చార్జీలు కలుపుకుని ఇంత పన్ను వసూలు చేస్తున్నట్లు తెలిపింది. అంతకుముందు,మే 5,2020 వరకూ కేంద్రం లీటర్ పెట్రోల్పై రూ.23,లీటర్ డీజిల్పై రూ.19 పన్ను వసూలు చేసింది. అంటే,దాదాపు గత ఏడాది కాలంగా పెట్రోల్పై అప్పటికే ఉన్న పన్నులకు తోడు మరో రూ.12,డీజిల్పై రూ.14 కేంద్రం అదనంగా వసూలు చేస్తోంది. ఈ పన్నులకు రాష్ట్రాలు విధిస్తున్న వ్యాట్ అదనం. దీంతో ఇంధన ధరలు సెంచరీ మార్క్కు చేరువయ్యాయి. రాజస్తాన్,మధ్యప్రదేశ్లలో సెంచరీ మార్క్ కూడా దాటేశాయి.
జీఎస్టీ పరిధిలోకి... ఆ ప్రతిపాదనలేవీ లేవు : కేంద్రమంత్రి
పెట్రోల్,డీజిల్ ధరలను కూడా జీఎస్టీ పరిధిలోకి తీసుకొస్తే ధరలు కాస్త తగ్గే అవకాశం ఉంటుందని గతంలో ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్,కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ అభిప్రాయపడిన సంగతి తెలిసిందే. కానీ ఇప్పుడు ఆ ఆలోచన లేదని కేంద్రం కుండబద్దలు కొట్టింది. కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ దీనిపై లోక్సభలో మాట్లాడుతూ... ఆర్టికల్ 279A(5) ప్రకారం... పెట్రోల్,డీజిల్,గ్యాస్,విమాన ఇంధన ధరలను జీఎస్టీ పరిధిలోకి తీసుకొచ్చేందుకు జీఎస్టీ కౌన్సిల్ ప్రతిపాదనలు ఉండాలన్నారు. ఇప్పటివరకూ రాష్ట్ర ప్రభుత్వాలు గానీ,జీఎస్టీ కౌన్సిల్ గానీ అలాంటి ప్రతిపాదనలేవీ చేయలేదన్నారు. కాబట్టి పెట్రోల్,డీజిల్,గ్యాస్,విమాన ఇంధన ధరలను ఇప్పట్లో జీఎస్టీ పరిధిలోకి తీసుకొచ్చే ప్రతిపాదనలేవీ కేంద్రం ముందు లేవన్నారు.
ప్రతిపాదనలు లేవంటూనే...
పెట్రోల్,డీజిల్లపై ఇప్పట్లో తగ్గింపు ప్రతిపాదనలు లేవంటూనే... తగ్గించేందుకు కేంద్రం సిద్దంగా ఉందని కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ పేర్కొనడం గమనార్హం. ఎక్సైజ్,వ్యాట్ తగ్గింపుపై కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి నిర్ణయం తీసుకోవాలన్నారు. ప్రస్తుతం పెట్రోల్,డీజిల్లపై కేంద్రం విధిస్తున్న ఎక్సైజ్ సుంకానికి తోడు రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాట్ విధిస్తున్న సంగతి తెలిసిందే. ఈ వ్యాట్ ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా ఉంది. ఆంధ్రప్రదేశ్లో లీటర్ పెట్రోల్పై రూ.25 వ్యాట్ విధిస్తుంటే... తెలంగాణలో రూ.22.7 వ్యాట్ వసూలు చేస్తున్నారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు విధిస్తున్న ఎక్సైజ్,వ్యాట్తో పాటు డీలర్ కమిషన్ కలిపితే ఇంధన ధరలు రూ.95,అంతకన్నా ఎక్కువగా నమోదవుతున్నాయి.