YS Jagan, KCR మెడకు అపెక్స్ ఉచ్చు-సహాయనిరాకరణపై కేంద్రం ఫైర్-రేపు సీఎస్ లతో భేటీ
ఏపీ, తెలంగాణ మధ్య గతంలో తలెత్తిన జల వివాదాల సందర్భంగా ఇరు ప్రభుత్వాలు కేంద్రాన్ని జోక్యం కోరాయి. దీంతో విభజన చట్టం దుమ్ముదులిపి రివర్ బోర్డుల్ని ఏర్పాటు చేస్తూ గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చేసింది. ఈ నేపథ్యంలో కృష్ణా, గోదావరి నదులపై ఉన్న దాదాపు అన్ని ప్రాజెక్టులు ఈ బోర్డుల పరిధిలోకి వచ్చేశాయి. ఇప్పుడు ఇరు తెలుగు ప్రభుత్వాలు నెత్తీ నోరూ బాదుకున్నా కేంద్రం వీటిపై మరో మాట లేదంటోంది. ఇది అంతిమంగా ఇరువురికీ ఎదురుదెబ్బగా మారబోతోంది.
గెజిట్ తు దారి తీసిన జల వివాదాలు
ఏపీ, తెలంగాణ మధ్య విభజన తర్వాత కృష్ణా, గోదావరి ప్రాజెక్టుల నిర్వహణ, నీటి కేటాయింపుల విషయంలో జల వివాదాలు నెలకొన్నాయి. ఇరు రాష్ట్రాలు సామరస్యంగా పరిష్కరించుకుంటే ఈ సమస్యలన్నీ ఏదో ఒక దశలో పరిష్కారమయ్యేవి. కానీ చంద్రబాబు, కేసీఆర్ హయాంలో మాత్రం కొంత సానుకూలంగా పరిష్కారాలు సాధించినా, జగన్, కేసీఆర్ హయాంలో మాత్రం ఈ వివాదాలపై ఎవరూ పట్టు వీడలేదు.
దీంతో ఈ వ్యవహారం కేంద్రం కోర్టులోకి వెళ్లిపోయింది. దీంతో జోక్యం చేసుకున్న కేంద్రం కొరడా ఝళిపించింది. జగన్, కేసీఆర్ ఊహించని విధంగా ఇరు రాష్ట్రాల్లో ప్రాజెక్టుల్ని తమ అధీనంలోకి తీసుకునేందుకు వీలుగా రివర్ బోర్డులు ఏర్పాటు చేస్తూ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.
కోరి తెచ్చుకున్న సమస్య
ఏపీ, తెలంగాణలో జల వివాదాల్ని ఇరు తెలుగు రాష్టాలు కలిసి కూర్చుని మాట్లాడుకుని ఉంటే సరిపోయేది. కానీ జగన్, కేసీఆర్ అలా చేయకుండా కేంద్రాన్ని ఆశ్రయించడంతో గెజిట్ నోటిఫికేషన్ల ద్వారా రివర్ బోర్డులు ఉనికిలోకి వచ్చేశాయి. అందులోకి ఒక్కొక్కిటిగా ప్రాజెక్టులు చేరడం మొదలుపెట్టాయి.
చివరికి ఇరు ప్రభుత్వాలకు ఇష్టం లేని ప్రాజెక్టులు కూడా రివర్ బోర్డుల పరిధిలోకి వెళ్లిపోతున్నాయి. దీంతో జగన్, కేసీఆర్ కు ఇబ్బందులు మొదలయ్యాయి. ఇప్పుడు ఈ ప్రాజెక్టులన్నింటినీ కేంద్రం చేతుల్లో పెట్టడంపై క్షేత్రస్ధాయిలో విమర్శలు తప్పడం లేదు. దీంతో ఇరు ప్రభుత్వాలు రివర్ బోర్డులకు సహాయనిరాకరణ మొదలుపెట్టాయి.
సహాయనిరాకరణపై కేంద్రం ఫైర్
గత అపెక్స్ కౌన్సిల్ భేటీలో తీసుకున్న నిర్ణయాల మేరకు ఇరు తెలుగు రాష్ట్రాల్లోని ప్రాజెక్టులను కృష్ణా, గోదావరి రివర్ బోర్డులకు అప్పగించాల్సి ఉంది. అయితే ఏపీ, తెలంగాణ మాత్రం అలా చేయకుండా సహాయనిరాకరణ మొదలుపెట్టాయి. దీనిపై కేంద్రం అసహనం వ్యక్తం చేస్తోంది. అపెక్స్ కౌన్సిల్ నిర్ణయాల ప్రకారం ప్రాజెక్టును రివర్ బోర్డులకు ఎందుకు అప్పగించడం లేదంటూ కేంద్రం ఫైర్ అవుతోంది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు ధిక్కరించడంపై చర్యలకు సైతం సిద్దమవుతోంది.
తెలుగు రాష్ట్రాలతో కేంద్రం తాడోపేడో
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు జగన్, కేసీఆర్ గత అపెక్స్ కౌన్సిల్ భేటీలో పాల్గొన్న సందర్భంగా ఇరు రాష్ట్రాల్లోని ప్రాజెక్టుల్ని రివర్ బోర్డులకు అప్పగించాలని నిర్ణయం తీసుకున్నారు. అలాగే ఇరు రాష్టాలు కూడా ప్రాజెక్టు నిర్వహణ, ఆఫీసులు, సిబ్బంది, ఇతర వనరుల కోసం చెరో రూ.200 కోట్లు చొప్పున ఇవ్వాలని కూడా నిర్ణయం తీసుకున్నారు.
కానీ ఇవేవీ ఇప్పటికీ అమలు కాలేదు. దీంతో కేంద్ర జల్ శక్తి శాఖ వీటిపై సీరియస్ గా స్పందిస్తోంది. సీఎస్ లకు ఇప్పటికే ఫోన్ చేసి మాట్లాడిన జల్ శక్తి శాఖ కార్యదర్శి సీరియస్ అయ్యారు. రేపు ఇద్దరు సీఎస్ లకు భేటీ అయి దీనిపై తాడోపేడో తేల్చుకునేందుకు ఆయన సిద్దమవుతున్నారు. దీంతో ఈ వ్యవహారంలో కేంద్రం తీసుకునే నిర్ణయాలపై ఉత్కంఠ నెలకొంది.