బెంగాల్ మాజీ సీఎస్కు కేంద్రం షోకాజ్- రిటైర్మెంట్కు గంటల ముందు- విపత్తుల చట్టం కింద
పశ్చిమబెంగాల్ ప్రభుత్వానికీ, కేంద్రానికి మధ్య జరుగుతున్న పోరులో బెంగాల్ సీఎస్ ఆలాపన్ బందోపాధ్యాయ్ ఇరుక్కున్నారు. ప్రధానితో సమీక్షకు హాజరుకాని ఆయన్ను ఢిల్లీలో రిపోర్ట్ చేయాలని ఆదేశించినా లెక్కచేయకపోవడంతో ఇప్పుడు విపత్తుల నియంత్రణ చట్టం కింద ఆయనకు కేంద్రం నోటీసులు జారీ చేసింది. ఈ చట్టం కింద గరిష్టంగా రెండేళ్ల జైలు శిక్ష విధించే అవకాశం కూడా ఉంటుంది.
పశ్చిమబెంగాల్ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్ మధ్య చెలరేగిన వివాదం రోజురోజుకీ ముదురుతోంది. ఎన్నికలు ముగిశాక బీజేపీ కార్యకర్తల్ని తృణమూల్ లక్ష్యంగా చేసుకోగా.. ఆ తర్వాత గవర్నర్ సాయంతో కేంద్రం తృణమూల్ను టార్గెట్ చేస్తోంది. ఇదే క్రమంలో యస్ తుఫాను సందర్భంగా ప్రధాని నిర్వహించిన సమీక్షా సమావేశానికి సీఎస్ ఆలాపన్ బందోపాధ్యాయ్ హాజరుకాకపోవడంతో కేంద్రానికి చిర్రెత్తుకొచ్చింది. దీంతో ఆయన్ను రీకాల్ చేసిన కేంద్రం.. గతంలో సర్వీసు పొడిగింపు మేరకు రిటైర్మెంట్ రోజునే ఢిల్లీలో రిపోర్ట్ చేయాలని సూచించింది. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సూచన మేరకు ఆయన ఢిల్లీ వెళ్లలేదు. దీంతో కేంద్రం ప్రత్యక్ష చర్యలకు దిగింది.
విపత్తుల నిర్వహణ చట్టంలోని నిబంధనల్ని ఉల్లంఘించినందుకు కేంద్రం బెంగాల్ సీఎస్ ఆలాపన్కు నోటీసులు పంపింది. కేంద్రం ఆదేశాల్ని ఉల్లంఘించినందుకు వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొంది. విపత్తుల నిర్వహణ చట్టంలోని సెక్షన్ 51 కింద తనపై ఎందుకు చర్యలు తీసుకోకూడదో మూడు రోజుల్లో కేంద్ర హోంశాఖకు రాతపూర్వకంగా చెప్పాలంటూ నోటీసుల్లో పేర్కొంది. అయితే రిటైర్మెంట్కు కొద్ది గంటల ముందు ఆయనకు ఈ నోటీసులు అందాయి. అయితే ఆయన కేంద్రం ఇచ్చిన పొడిగింపును కాదని రిటైర్ అయ్యారు.