డిజిటల్ న్యూస్ కు కేంద్రం కళ్లెం-మీడియా చట్టంలో చేర్చి- దేశంలో తొలిసారి..
దేశవ్యాప్తంగా మీడియాను తన గుప్పిట్లో పెట్టుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్న కేంద్రం.. ఇప్పుడు మరో కీలక నిర్ణయం దిశగా అడుగులేస్తోంది. ప్రభుత్వ నియంత్రణలో లేని డిజిటల్ మీడియాను నియంత్రించేందుకు వీలుగా మీడియా చట్టంలో మార్పులు చేస్తోంది. ఈ ప్రక్రియ ప్రారంభమైంది.
దేశంలో మీడియా నమోదు కోసం కొత్త చట్టం తీసుకురావాలని కేంద్రం భావిస్తోంది. దేశంలో మొట్టమొదటిసారిగా, డిజిటల్ మీడియాకు ఇందులో స్ధానం కల్పించనున్నారు. ఇది గతంలో ఎప్పుడూ ప్రభుత్వ నియంత్రణలో భాగంగా లేదు. కానీ కేంద్రం ప్రస్తుతం ప్రతిపాదిస్తున్న సవరణ బిల్లు క్లియర్ అయితే, డిజిటల్ వార్తల సైట్ల ఉల్లంఘనలపై చర్యలు తీసుకునేందుకు అవకాశం దొరుకుతుంది. ఇందులో రిజిస్ట్రేషన్ రద్దు చేయడంతో పాటు జరిమానా కూడా విదించేలా మార్పులు చేస్తున్నారు.
సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ప్రెస్, పీరియాడికల్స్ రిజిస్ట్రేషన్ బిల్లును సవరించడానికి, "ఏదైనా ఎలక్ట్రానిక్ పరికరం ద్వారా డిజిటల్ మీడియాలో వార్తలను" దాని పరిధిలో చేర్చడానికి ప్రక్రియను ప్రారంభించింది. ఇందులో భాగంగా డిజిటల్ న్యూస్ పబ్లిషర్లు రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేసుకోవాలి.త చట్టం అమల్లోకి వచ్చిన 90 రోజులలోపు ఈ దరఖాస్తు చేసుకోవాలి. డిజిటల్ ప్రచురణకర్తలు ప్రెస్ రిజిస్ట్రార్ జనరల్తో నమోదు చేసుకోవాలి. వారు ఉల్లంఘనలకు పాల్పడినప్పుడు ఆయా కథనాలపై చర్యలు తీసుకునే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది. అలాగే రిజిస్ట్రేషన్లను నిలిపివేయవచ్చు లేదా రద్దు చేయవచ్చు మరియు జరిమానాలు విధించవచ్చు.
డిజిటల్ మీడియాలో కథనాలపై వచ్చే ఫిర్యాదుల పరిష్కారానికి ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్పర్సన్ చీఫ్గా అప్పీలేట్ బోర్డు కూడా ఏర్పాటు చేయబోతున్నారు. డిజిటల్ మీడియా ఇప్పటివరకు ఏ చట్టం లేదా నియంత్రణ కింద లేదు. సవరణలు డిజిటల్ మీడియాను సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ అడ్మినిస్ట్రేటివ్ మంత్రిత్వ శాఖ నియంత్రణలోకి తీసుకువస్తాయి. ఈ బిల్లును ప్రధానమంత్రి కార్యాలయం., ఇతర భాగస్వాములు ఆమోదించాల్సి ఉందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.