దేశంలో H3N2 వైరస్ కల్లోలం- తీవ్రంగా ఫ్లూ లక్షణాలు-అప్రమత్తంగా ఉండాలని కేంద్రం హెచ్చరికలు
దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో జ్వరాల కేసులు పెరుగుతున్నాయి. హెచ్3ఎన్2 వైరస్ ఫ్లూ లక్షణాలతో కల్లోలం రేపుతున్న నేపథ్యంలో కేంద్రం ఇవాళ పలు సూచనలు చేసింది.
దేశంలో కరోనా వైరస్ మహమ్మారి బారి నుంచి క్రమంగా కోలుకుంటున్న వేళ.. కొత్త వైరస్ హెచ్3ఎన్2 వైరస్ కల్లోలం రేపుతోంది. జ్వరం, ఫ్లూ లక్షణాలతో కూడిన ఈ వైరస్ బారిన జనం పడుతున్నారు. పైకి జ్వరం, జలుబుగా మాత్రమే కనిపిస్తున్న ఈ వైరస్ పై ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తో పాటు కేంద్రం కూడా ఇవాళ అడ్వైజరీలు విడుదల చేశాయి.
దేశంలోని పలు రాష్ట్రాల్లో హెచ్3ఎన్2 వైరస్ కేసులు పెరుగుతున్నాయి. జ్వరం, జలుబు, దగ్గు, గొంతు నొప్పి వంటి వైరస్ లక్షణాలతో వందల సంఖ్యలో జనం ఆస్పత్రుల్లో చేరుతున్నారు. ఫ్లూ కేసుల తీవ్రత పలు రాష్ట్రాల్లో ఎక్కువగా ఉండగా.. మరికొన్ని చోట్ల ఇప్పుడిప్పుడే మొదలవుతోంది. దీంతో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్ని కేంద్రం అప్రమత్తం చేసింది. దేశంలోని అనేక ప్రాంతాలలో గత రెండు నెలల్లో దీర్ఘకాలిక అనారోగ్యం, దీర్ఘకాలిక దగ్గుతో ఎక్కువ ఫ్లూకేసులు నమోదవుతున్నాయి.

దేశవ్యాప్తంగా జ్వరం, ఫ్లూ కేసులు ఎక్కువగా నమోదవుతున్నట్లు ఐసీఎంఆర్ కూడా ప్రకటించింది. ఇన్ఫ్లుయెంజా ఎ ఉపరకం హెచ్3ఎన్2 వైరస్ కారణంగానే ఇలా జరుగుతుందని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) తెలిపింది. H3N2 వైరస్ ఇతర ఉప రకాల కంటే ఎక్కువగా జనాన్ని ఆస్పత్రుల పాలు చేస్తున్నట్లు గుర్తించారు. గత రెండు మూడు నెలలుగా భారతదేశం అంతటా విస్తృతంగా వ్యాపిస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు.
ఈ వైరస్ లక్షణాలు సాధారణంగా జ్వరంతో పాటు నిరంతరాయంగా దగ్గును కలిగి ఉంటాయని నిపుణలు చెప్తున్నారు. ఈ ఇన్ఫెక్షన్ తగ్గేందుకు చాలా సమయం తీసుకుంటున్నట్లు కూడా గుర్తించారు. రోగి కోలుకున్న తర్వాత కూడా లక్షణాలు చాలా కాలం పాటు కొనసాగుతాయని చెప్తున్నారు. ఇతర ఇన్ఫ్లుఎంజా ఉపరకాల కంటే H3N2 వైరస్ ఎక్కువ జనాల్ని ఆస్పత్రుల పాలు చేస్తున్నట్లు గుర్తించారు.












Click it and Unblock the Notifications