మీరాతో సహా మాజీలకు జడ్ ప్లస్ సెక్యూరిటీ తొలగింపు: ముఖేష్, స్వామికి ఓకె
న్యూఢిల్లీ: లోక్సభ మాజీ స్పీకర్ మీరా కుమార్ తోపాటు పలువురు కేంద్రమాజీ మంత్రులు, వీఐపీలకు జెడ్ప్లస్ భద్రతా ఏర్పాట్లను పూర్తిగా తొలగిస్తూ కేంద్ర హోంశాఖ నిర్ణయం తీసుకుంది. జెడ్ప్లస్ క్యాటగిరీ భద్రత ఉన్న వ్యక్తులకు అత్యాధునిక ఆయుధాలతో సుమారు 24 నుంచి 36 మంది సిబ్బంది ఎల్లవేళలా రక్షణ కల్పిస్తారు. ఇటీవల కేంద్ర హోంశాఖ కార్యదర్శి ఎల్సీ గోయల్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో పలువురు వీఐపీల భద్రతపై సమీక్ష జరిపారు.
మావోయిస్టుల నుంచి ముప్పు ఉందన్న సమాచారంతో ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి రమణ్సింగ్కు ఏర్పాటు చేసిన బ్లాక్ క్యాట్ ఎన్ఎస్జీ కమాండోల సెక్యూరిటీని తగ్గించి సీఆర్పీఎఫ్ క్యాటగిరీకి మార్చారు. భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్షా, మాజీ పోలీస్ ఉన్నతాధికారి కేపీఎస్ గిల్, నితిన్ గడ్కరీ, జితేంద్రసింగ్కు మాత్రం దేశవ్యాప్తంగా జెడ్ప్లస్ కేటగిరీ భద్రతను కొనసాగించాలని నిర్ణయించారు.
మహారాష్ట్రలో రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీకి, దక్షిణ భారతంలో బిజెపి నేత సుబ్రమణ్యస్వామికి జెడ్ప్లస్ భద్రతను కల్పించనున్నారు. బీహార్ మాజీ సీఎం లాలూప్రసాద్యాదవ్కు ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న జెడ్ప్లస్ భద్రతను తగ్గించి కేవలం ఢిల్లీ, బీహార్లోనే ఏర్పాటు చేయనున్నారు. జమ్మూకాశ్మీర్ బిజెపి నేత లాల్ సింగ్, యోగా గురువు రాందేవ్కు జడ్ కేటగిరి భద్రత కల్పించాలని నిర్ణయించారు.
కాంగ్రెస్ నేతలు మనీశ్తివారీ, శ్రీప్రకాశ్ జైస్వాల్, రీటా బహుగుణజోషి, జితిన్ప్రసాద్కు పూర్తిగా జెడ్ప్లస్ భద్రతను పూర్తిగా తొలగించారు. లోక్జనశక్తి పార్టీ నేత రాంవిలాస్ పాశ్వాన్, ఆయన కుమారుడు చిరాగ్కు వై క్యాటగిరీ భద్రతను ఏర్పాటు చేశారు. కాగా, శారదా చిట్ఫండ్ కుంభకోణంలో ఇటీవల అరెస్టయిన మాతంగ్సింగ్కు 14 రాష్ర్టాల్లో జెడ్ ప్లస్ భద్రతను కొనసాగించడం చర్చనీయాంశమైంది