దేశంలో కరోనా నాలుగో వేవ్: నిర్లక్ష్యంగా ఉండొద్దంటూ రాష్ట్రాలకు కేంద్రం హెచ్చరిక
న్యూఢిల్లీ: భారతదేశంలో కరోనా వైరస్ కేసులు క్రమంగా తగ్గుముఖం పట్టినప్పటికీ ప్రపంచంలోని పలు దేశాల్లో మళ్లీ మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో రాష్ట్రాలను అప్రమత్తం చేసింది కేంద్ర ప్రభుత్వం. చైనా సహా ఆగ్నేసియా, ఐరోపాలోని కొన్ని దేశాల్ల గత కొన్ని రోజులుగా కొత్త కేసులు భారీగా పెరుగుతున్నాయి. దీంతో భారతదేశంలోనూ నాలుగో వేవ్ వచ్చే అవకాశాలున్నాయని వార్తలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు కీలక సూచనలు చేసింది.
Recommended Video
కరోనా మహమ్మారి పట్ల నిర్లక్ష్యం వద్దంటూ రాష్ట్రాలకు వార్నింగ్
కరోనా వైరస్ మహమ్మారి పట్ల నిర్లక్ష్యంగా ఉండకూడదంటూ రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది. ప్రజలంతా కరోనా నిబంధనలు పాటించేలా చూడాలని, కరోనా పరీక్షలు పెంచాలని సూచించింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు లేఖ రాశారు. కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. కరోనా కట్టడిలో ఐదంచెల వ్యూహమైన టెస్ట్, ట్రాక్, ట్రీట్, కోవిడ్ నిబంధనలు, వ్యాక్సినేషన్ పై దృష్టి సారించాలన్నారు. వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. కరోనా నిర్ధారణ పరీక్షలు పెంచాలని, కొత్త కేసుల క్లస్తర్లపై నిఘా పెట్టాలన్నారు. బహిరంగ ప్రదేశాలు, సామూహిక కార్యక్రమాల్లో మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటి నిబంధనలపై అవగాహన పెంచాలని సూచించారు.
కరోనా తగ్గినట్లే తగ్గి మళ్లీ విజృంభిస్తోంది..
ప్రపంచంలోని పలు దేశాల్లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ మార్చి 16న ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారని రాజేష్ భూషణ్ వెల్లడించారు. కరోనా పరిస్థితులపై అప్రమత్తంగా ఉండాలని, జీనోమ్ సీక్వెన్సింగ్పై దృష్టి పెట్టాలని రాష్ట్రాలకు సూచించినట్లు తెలిపారు. కాగా, ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా రెండ్రోజుల క్రితం కరోనా మహమ్మారి తగ్గినట్లే తగ్గి మళ్లీ విజృంభిస్తోందని ప్రపంచ దేశాలను హెచ్చరించింది. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే మరోసారి మహమ్మారి విజృంభించే అవకాశం ఉందని పేర్కొంది. కరోనా ఆంక్షలు ఎత్తివేసిన ప్రాంతాల్లోనే కేసులు ఎక్కువగా నమోదువుతున్నాయని తెలిపింది.
భారతదేశంలో అదుపులోని కరోనా వ్యాప్తి
అయితే, భారతదేశంలో ప్రస్తుతానికి కరోనా వ్యాప్తి అదుపులోనే ఉంది. వరుసగా ఐదో రోజు కూడా కేసుల సంఖ్య 3వేలకు దిగువనే ఉంది. మరణాలు మాత్రం కాస్త పెరిగాయి. గత 24 గంటల వ్యవధిలో దేశంలో కొత్తగా 2538 కరోనా కేసులు నమోదు కాగా, 149 మరణాలు చోటు చేసుకుంటున్నాయి. దేశంలో యాక్టివ్ కేసులు 30వేలకు దిగువనే ఉన్నాయి. అయితే, పలు రాష్ట్రాల్లో టెస్టుల సంఖ్య తగ్గడం కూడా కేసుల తగ్గుదల కారణంగా తెలుస్తోంది. కరోనా కేసులు తగ్గుతుండటంతో అటు ప్రభుత్వాలు, ఇటు ప్రజలు కరోనా నిబంధనలు పాటించడం లేదు. ఈ క్రమంలోనే కేంద్రం మరోసారి అప్రమత్తం చేసింది.