Tamil Nadu Polls: కష్టాల్లో ఎన్డీయే ? మోడీ కోసం రంగంలోకి చంద్రబాబు..!
తమిళనాడు (Tamil Nadu) లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ నెల 23న జరిగే ఎన్నికల్లో తమిళనాడు ఓటర్లు తమ తీర్పు చెప్పేయబోతున్నారు. ఓటరు నాడిని పసిగట్టేందుకు పలు సర్వే సంస్థలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇందులో మెజార్టీ సర్వేలు అధికార డీఎంకేకు అనుకూలంగా ఫలితాలు వెలువరిస్తున్నాయి. ఇలాంటి సమయంలో విపక్ష అన్నాడీఎంకే-బీజేపీ కూటమి వెనుకబడిందన్న విషయం అర్దమవుతోంది. దీంతో ఎన్డీయేలో కీలక నేతగా ఉన్న చంద్రబాబు (Chandrababu) రంగంలోకి దిగుతున్నారు.
తమిళనాడులో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల తరపున రేపటి నుంచి ఎన్నికల ప్రచారానికి వెళ్లాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. ఈ మేరకు చంద్రబాబు ప్రచార షెడ్యూల్ విడుదల చేశారు. ప్రధాని మోడీ విజ్ఞప్తి మేరకు ఆయన ఈ నెల 20, 21 తేదీల్లో తమిళనాడులో ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోతున్నారు. రేపు మధ్యాహ్నం అమరావతి నుంచి కోయంబత్తూరు వెళ్లనున్న చంద్రబాబు.. కోయంబత్తూరు, హోసూరు, చెన్నై, ఆవడి ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు.

హోసూరు సమీపంలోని తాలిలో నిర్వహించనున్న బహిరంగ సభలో చంద్రబాబు పాల్గొని ప్రసంగించనున్నారు. అలాగే ఆవడిలో రోడ్ షో నిర్వహించి ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల తరపున ప్రచారం చేయనున్నారు. ఎల్లుండి రెండో రోజు మధురై- సాత్తూర్ లలో చంద్రబాబు ఎన్నికల ప్రచారం నిర్వహించబోతున్నారు. తమిళనాడులో తెలుగు వారు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో పర్యటించి ఆయన ఓట్లు అభ్యర్ధించనున్నారు. అయితే ప్రస్తుతం డీలిమిటేషన్ బిల్లు లోక్ సభలో వీగిపోయిన తర్వాత తమిళుల్లో బీజేపీపై వ్యక్తమవుతున్న ఆగ్రహాన్ని చంద్రబాబు ఎలా చల్లారుస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది.














Click it and Unblock the Notifications