చంద్రయాన్ 2 రేపే ల్యాండింగ్: ఆ 15 నిమిషాలే భయానకం, ఆ తర్వాతే పని ప్రారంభం, కీలక ఘట్టాలివే..
న్యూఢిల్లీ: అంతరిక్ష రంగంలో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) మరో ఘనతను సాధించనుంది. మరికొద్ది గంటల్లో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్ 2 చివరిదైన కీలక ఘట్టాన్ని చేరుకోనుంది. చంద్రుడి నిగూఢ రహస్యాలను తెలుసుకునేందుకుఇస్రో చేపట్టిన రెండో ప్రయోగం ఇది.
ఆ 15 నిమిషాలే కీలకం
అన్ని అనుకున్నట్లుగా జరిగితే చంద్రయాన్ 2లో చంద్రుడిపై ల్యాండర్ విక్రమ్ విజయవంతంగా శుక్రవారం(సెప్టెంబర్ 7న) అడుగుపెట్టనుంది. చంద్రుడిపై కాలు మోపే ముందు 15 నిమిషాలే చాలా కీలకంగా మారాయి. అత్యంత వేగంతో తిరుగుతున్న ఈ స్పేస్క్రాఫ్ట్ వేగం ప్రస్తుతం గంటకు 6వేల కిలోమీటర్లు ఉంది. అంతటి వేగాన్ని కేవలం 15 నిమిషాల్లోనే క్రమంగా తగ్గించుకుంటూ వచ్చి విక్రమ్ ల్యాండర్ చంద్రుడిపై నెమ్మదిగా దిగుతుంది. ఇదే చంద్రయాన్ 2లో అతి కీలకమైన చివరి ఘట్టం.
సెప్టెంబర్ 7న కీలక ఘట్టం
శుక్రవారం అర్ధరాత్రి దాటాక 1.40గంటలకు చంద్రుడి కక్ష నుంచి కిందకు దిగే క్రమంలో ప్రధాన దశకు సంబంధించి ఇస్రో శాస్త్రవేత్తలు విక్రమ్ లాండర్కు చంద్రుడిపై దిగేందుకు ఆదేశిలిస్తారు. ఆ సమయంలో చంద్రుడిపై 35x100 కిలోమీటర్ల కక్ష్యలో, గంటకు 6120 కిలోమీటర్ల వేగంతో ఉంటుంది విక్రమ్ ల్యాండర్. ఇస్రో శాస్త్రవేత్తలు ఆదేశాలు ఇవ్వగానే ల్యాండర్లోని థ్రాటుల్ ఏబుల్ ఇంజిన్లు మండుతాయి. అవి ల్యాండర్ గమనానికి వ్యతిరేక దిశలో మండుతూ ఆ స్పేస్క్రాఫ్ట్ వేగాన్ని తగ్గించేందుకు తోడ్పడతాయి. దీంతో ల్యాండర్ తక్కువ వేగంతో కిందకు దిగడం ప్రారంభమవుతుంది.
సౌరశక్తితో ఛార్జింగ్..
కాగా, చంద్రుడిపై విక్రమ్ ల్యాండర్ కాలుమోపే సమయానికి అక్కడ సూర్యదయమవుతుంది. దీంతో ఈ స్పేస్క్రాఫ్ట్ తన సౌర ఫలకాల ద్వారా బ్యాటరీలను రీఛార్జ్ చేసుకుంటుంది. ఆ తర్వాత భూ కేంద్రంతో నేరుగా హై బ్యాండ్విడ్త్ లింక్ను ఏర్పాటు చేసుకుని కమ్యూనికేట్ చేస్తుంది.. తన పరిధిలోకి వచ్చినప్పుడల్లా ఆర్బిటర్తోనూ కమ్యూనికేషన్ సాగిస్తుంది. మొదట ఇస్రో శాస్త్రవేత్తలు ల్యాండర్ పరిస్థితిని తనిఖీ చేస్తారు. అంతా సరిగ్గా ఉంటే చంద్రుడి ఉపరితల కార్యకలాపాలు ప్రారంభిస్తుంది.
భారత జాతీయ పతాకం.. ఇస్రో లోగో..
ల్యాండింగ్ సమయంలో చంద్రుడిపై పైకి లేచే ధూళి దుమ్ము నాలుగు గంటల్లో సర్దుకుంటుంది. ఆ తర్వాత ల్యాండర్ నుంచి జారుడు బల్ల లాంటి ర్యాంప్ విచ్చుకుంటుంది. దాని మీద నుంచి ఆరు చక్రాల ‘ప్రజ్ఞాన్' రోవర్ కిందకు దిగుతుంది. అయితే ఈ రోవర్ నేరుగా భూకేంద్రంతో సంప్రదించలేదు. ఆర్బిటర్తో మాత్రమే కమ్యూనికేషన్ సాగిస్తుంది. కాగా, రోవర్పై భారత జాతీయ పతాకాన్ని ఇస్రో లోగోను చిత్రీకరిస్తుంది.
కీలక సమాచారాన్ని అందిస్తుంది.. 14రోజులపాటు
చంద్రుడి దక్షిణార్థ గోళంలో మాంజినస్ సి, సెంపెలియస్ ఎన్ అనే రెండు బిలాల మధ్య ప్రాంతంలో ల్యాండర్ దిగుతుంది. జపాన్కు చెందిన కగుయా ఆర్బిటర్, అమెరికాకు చెందిన ఎన్ఆర్ఓ ఆర్బిటర్లు అందించిన చిత్రాలు, డేటాను విశ్లేషించిన ఇస్రో ఈ ప్రాంతాన్ని ఎంపిక చేసింది. చంద్రుని ఉపరితలంపై తిరుగుతూ అక్కడి మట్టి, రాళ్ల నమూనాలు సేకరించి అక్కడే విశ్లేషణ చేస్తుంది. అంతేగాక, ఖనిజాలా పరిశీలన, మూలకాల లభ్యత, నీరు, మంచురూపంలోని నీటి లభ్యతను పరిశీలించడం, చంద్రునిపై వాతావరణ అధ్యయనం చేస్తుంది ఈ రోవర్. ఈ సమాచారాన్నంత రోవర్ ల్యాండర్కు అందజేస్తే.. ల్యాండర్ ద్వారా భూమిపై ఉన్న ఇస్రో అనుసంధానించే కేంద్రానికి చేరుతుంది. 14రోజులపాటు రోవర్ ఈ పరిశోధనా కార్యక్రమాన్ని నిర్వహించే విధంగా సాఫ్ట్వేర్ రూపొందించారు శాస్త్రవేత్తలు. ఈ లోపు చంద్రుని కక్ష్యలో తిరిగే ఆర్బిటర్ చంద్రుని ఉపరితల ఫొటోలను తీసి ఇస్రో కేంద్రానికి పంపుతుంది.