ఆప్ఘనిస్తాన్ హార్రర్పై స్పందించిన రక్షణమంత్రి రాజ్నాథ్: సైన్యంలో కొత్త విభాగం
న్యూఢిల్లీ: ఇస్లామిక్ దేశం ఆప్ఘనిస్తాన్లో నెలకొన్న తాజా పరిణామాలు ప్రపంచ దేశాలను మరోసారి భయాందోళనలకు గురి చేస్తోన్నాయి. తాలిబన్లు ఆ దేశాన్ని ఆక్రమించుకోవడం ఒక ఎత్తయితే.. ఆ తరువాత సంభవించిన జంట పేలుళ్లు మరో ఎత్తుగా మారాయి. తాలిబన్ల పరిపాలనలో ఆప్ఘనిస్తాన్.. భయానక ఉగ్రవాద సంస్థలు, టెర్రరిస్టులకు షెల్టర్ జోన్గా మారుతుందనే అనుమానాలు వాస్తవ రూపాన్ని దాల్చాయి. హమీద్ కర్జాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం సహా కాబుల్లో సంభవించిన జంట పేలుళ్లు ప్రపంచ దేశాలను ఉలిక్కి పడేలా చేశాయి.
పీవీ సింధుకి 'మెగా' సన్మానం: హాజరైన సినీ ప్రముఖులు (ఫోటోలు)
ఆఫ్ఘన్ సంక్షోభంపై స్పందించిన రాజ్నాథ్..
ఈ తరహా దాడులు మరిన్ని సంభవిస్తాయంటూ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్వయంగా చేసిన ప్రకటన కూడా ఆప్ఘనిస్తాన్లో నెలకొన్న పరిస్థిితుల తీవ్రతకు అద్దం పడుతోంది. ఈ పరిణామాలను భారత్ కూడా ఎప్పటికప్పుడు నిశితంగా పరిశీలిస్తోంది. పరిస్థితులకు అనుగుణంగా ముందు జాగ్రత్త చర్యలను తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో- రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆప్ఘనిస్తాన్ సంక్షోభంపై స్పందించారు. ఆ దేశం తాలిబన్ల దురాక్రమణలోకి వెళ్లిన తరువాత రాజ్నాథ్ సింగ్ స్పందించడం ఇదే తొలిసారిగా భావిస్తోన్నారు.
విధానాలు, వ్యూహాల పునఃసమీక్ష
ఆప్ఘన్లో నెలకొన్న పరిణామాలు సరికొత్త సవాళ్లను విసుతున్నాయని రాజ్నాథ్ సింగ్ వ్యాఖ్యానించారు. ఊహించిన దాని కంటే.. అంచనాలను మించిన వేగంతో మారిపోతోన్నాయని పేర్కొన్నారు. అక్కడి పరిస్థితులు బలవంతంగా దేశ విదేశాంగ విధానాలు, వ్యూహాలను పునఃసమీక్షించుకోవాల్సిన పరిస్థితిని కల్పించినట్టయిందని స్పష్టం చేశారు. ఆప్ఘనిస్తాన్లో ఉగ్రవాదుల ప్రాబల్యం పెరగకుండా ఉండటానికి కొన్ని ముందు జాగ్రత్త చర్యలను తప్పనిసరిగా తీసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు.
క్వాడ్ స్ట్రాటజీ అమలు..
తమిళనాడులోని వెల్లింగ్టన్లో గల డిఫెన్స్ సర్వీసెస్ స్టాఫ్ కాలేజ్లో నిర్వహించిన ఓ కార్యక్రమానికి రాజ్నాథ్ సింగ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అనంతరం ప్రసంగించారు. ఆఫ్ఘనిస్తాన్లో నెలకొన్న తాజా పరిస్థితులకు అనుగుణంగా తమ కొత్త వ్యూహాలను రూపొందించుకుంటోన్నామని, క్వాడ్ స్ట్రాటజీని అనుసరించాలని భావిస్తున్నట్లు తెలిపారు రాజ్నాథ్ సింగ్. స్వదేశంలో ఉగ్రవాదాన్ని విజయవంతంగా అణచివేయగలిగామని, అదే పరిస్థితిని పొరుగు దేశాలు కూడా పాటించేలా అంతర్జాతీయ స్థాయిలో ఒత్తిడిని తీసుకుని రాగలిగామని చెప్పారు.
చైనాకు బుద్ధి చెప్పాం..
ఆఫ్ఘనిస్తాన్ను తాలిబన్లు ఆక్రమించుకున్న తరువాత.. ఉగ్రవాద జాడ్యం మళ్లీ క్రమంగా పురుడు పోసుకుంటోందనే సమాచారం అందుతోందని అన్నారు. కేంద్ర పాలిత ప్రాంతం లఢక్ సమీపంలోని వాస్తవాధీన రేఖ వద్ద చోటు చేసుకున్న పరిణామాలను రాజ్నాథ్ సింగ్ ప్రస్తావించారు. వాస్తవాధీన రేఖను దాటుకుని భారత భూభాగంపైకి చొరబడటానికి ప్రయత్నించిన చైనా పీపుల్స్ లిబరేషన్స్ ఆర్మీ బలగాలను సరిహద్దు భద్రతా జవాన్లు సమర్థవంతంగా అడ్డుకున్నారని అన్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో చైనా చొరబాటుకు ప్రయత్నిస్తోందని పేర్కొన్నారు.
పరోక్ష యుద్ధానికి పాకిస్తాన్..
భారత్తో రెండు యుద్ధాల్లో ఘోర పరాభవాన్ని చవి చూసిన తరువాత.. పాకిస్తాన్ భారత్పై అక్కసును పెంచుకుందని రాజ్నాథ్ సింగ్ వ్యాఖ్యానించారు. దేశాన్ని అస్థిరపరచడానికి పరోక్ష యుద్ధానికి తెర తీసిందని ఆరోపించారు. ఉగ్రవాదులకు ఆయుధ సంపత్తిని సమకూర్చుతోందని విమర్శించారు. భారత్ను లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడుతోందని మండిపడ్డారు. తరచూ కాల్పుల ఉల్లంఘనకు పాల్పడుతోందని పేర్కొన్నారు.
ఇంటిగ్రేటెడ్ బ్యాటిల్ గ్రూప్స్
ఈ పరిణామాలన్నింటినీ దృష్టిలో ఉంచుకుని సైన్యంలో సరికొత్త విభాగాన్ని సృష్టించునున్నట్లు రాజ్నాథ్ సింగ్ తెలిపారు. ఇంటిగ్రేటెడ్ బ్యాటిల్ గ్రూప్స్ పేరుతో ఈ యూనిట్ అందుబాటులోకి రానుందని అన్నారు. అత్యంత ప్రమాదకరంగా దీన్ని తీర్చిదిద్దుతున్నామని పేర్కొన్నారు. ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా అప్పటికప్పుడు సత్వర నిర్ణయాలను తీసుకోవడం, శతృవులపై విరుచుకుపడేలా ఉంటుందని చెప్పారు. క్రమంగా సైన్యంలో ఇలాంటి ఇంటిగ్రేటెడ్ బ్యాటిల్ గ్రూప్ల సంఖ్య రెట్టింపు అవుతుందని రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు.