ఆన్ లైన్ సేల్స్: మెడికల్ షాప్లు గుర్రు, బంద్
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తూ ఈనెల 14వ తేదిన దేశ వ్యాప్తంగా మెడికల్ షాపులు మూసివేసి నిరసన వ్యక్తం చెయ్యాలని మెడికల్ షాపుల వ్యాపారులు నిర్ణయించారు. ఆన్ లైన్ లో ఔషదాలు కొనుగోలు చెయ్యడానికి అవకాశం కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
కేంద్ర ప్రభుత్వం ఇదే విదంగా వ్యవహరిస్తే రిటైల్ రంగంలోని వ్యాపారులు తీవ్రస్థాయిలో నష్టపోతారని ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్స్ అండ్ డ్రగిస్ట్ (ఏఐఓసీడీ) పదాధికారులు ఆరోపిస్తున్నారు. ఈ విధంగా చిల్లర, రిటైల్ రంగాన్ని నమ్ముకుని ఔషదాలు విక్రయిస్తున్న వ్యాపారులు రోడ్డున పడుతారని అంటున్నారు.
దేశ వ్యాప్తంగా జరుగుతున్న మెడికల్ షాపుల బంద్ కు కర్ణాటక లోని వ్యాపారులు పూర్తి మద్దతు ఇస్తున్నారని ఆ సంఘం పదాధికారులు ఎం.సీ. మాదప్ప, రఘునాథరెడ్డి, శివానంద చెప్పారు. కేంద్ర ప్రభుత్వం నియమాలు గాలికి వదిలేస్తున్నదని మండిపడ్డారు.
కేంద్ర ప్రభుత్వ డ్రగ్స్ అండ్ కాస్మోటిక్ చట్టం 1940 సెక్షన్ 65(10)(ఏ) ప్రకారం వైద్యుడి సలహా చీటి ఉంటేనే రోగికి మందుల షాప్ లో ఔషదాలు ఇవ్వవలసి ఉంటుంది. అయితే ఆన్ లైన్ ద్వారా ఔషదాలు విక్రయిస్తే ఈ నియమాలు ఉల్లంఘించినట్లు అవుతుందని అన్నారు.
ఆన్ లైన్ ఫార్మా పద్దతిలో ఔషదాలు కొనుగోలు చేస్తే ఆ మందులు నేరుగా ఇంటి గుమ్మం దగ్గరకు వెళుతాయని, ఆ మందుల వలన లేనిపోని సమస్యలు వస్తాయని, ప్రాణాంతక ఔషదాల వలన ఇబ్బందులు ఎదుర్కోనే అవకాశం ఉందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తు ఒక్క రోజు మెడికల్ షాపులు మూసి వేస్తున్నామని వ్యాపారులు స్పష్టం చేశారు.