చెన్నైవాసులకి ఎయిర్టెల్ 'ఫ్రీ' కాల్స్, జాతీయవిపత్తు!
చెన్నై: తమిళనాడు రాజధాని చెన్నైలో భారీ వర్షాలు, ప్రజల ఇబ్బందుల నేపత్యంలో ఎయిర్ టెల్ తమ వినియోగదారులకు ఉచిత ఆఫర్ ఇచ్చింది. వర్ష బీభత్సంతో చెన్నై నీటి మునిగిన విషయం తెలిసిందే. లక్షలాది ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
ఈ నేపథ్యంలో ఎయిర్ టెల్ కంపెనీ ఉచిత ఫోన్ కాల్స్ సౌకర్యం కల్పించింది. ప్రతి ఎయిర్ టెల్ ప్రీపెయిడ్ వినియోగదారుడికీ ఉచితంగా రూ.30ల బ్యాలెన్స్ ఇస్తున్నట్టు ప్రకటించింది. అంతేకాదు, ఎయిర్ టెల్ నుంచి ఎయిర్ టెల్ కస్టమర్లు 10 నిమిషాల పాటు ఉచితంగా మాట్లాడుకునేలా వెసులుబాటు కల్పించింది.
ఫోన్ కాల్స్కు తోడు... మొబైల్ డేటా 50 ఎంబీ ఉచితంగా కల్పించింది. ఈ వెసులుబాటు రెండు రోజుల పాటు అమల్లో ఉండనుంది. అలాగే, పోస్ట్ పెయిడ్, ఫిక్స్డ్ లైన్ కస్టమర్లకు కూడా కొంత వెసులుబాటును కల్పించింది.
జాతీయ విపత్తుగా ప్రకటించండి: జయలలిత
భారీ వర్షాలను జాతీయ విపత్తుగా ప్రకటించాలని అన్నాడీఎంకే పార్టీ బుధవారం డిమాండ్ చేసింది. ఈ మేరకు లోకసభలో ఆ పార్టీ ఎంపీ వెంకటేశ్ బాబు మాట్లాడుతూ... భారీ వర్షాలతో కుదేలైన తమ రాష్ట్రాన్ని కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.
కుండపోత వర్షం, ప్రకృతి ప్రకోపం కారణంగా తమ రాష్ట్రం అతలాకుతలమైందన్నారు. భారీ వర్షాలతో తలెత్తిన సమస్యలను ఎదుర్కోవడానికి తమ రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, ఇలాంటి విపత్తులను ఎదుర్కొనేందుకు దీర్ఘకాలిక నీటి నిర్వహణ ప్రణాళికలు ఎంతో అవసరమన్నారు.