చెన్నై వరదలపై షాకింగ్! ఫోటోలు పోస్ట్ చేసిన ఖుష్బూ
చెన్నై: భారీ వర్షం, వరదల కారణంగా రాజధాని చెన్నై, తమిళనాడు లోని కొన్ని ప్రాంతాలు అస్తవ్యస్తం అయ్యాయి. చెన్నై సహా వరద ప్రభావిత ప్రాంతాలు ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నాయి. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలతో పాటు స్వచ్చంధ సంస్థలు, ప్రముఖులు బాధిత ప్రజలకు తమ వంతు సాయం అందిస్తున్నారు.
కాగా, ప్రభుత్వం వాతావరణ హెచ్చరికలను పట్టించుకోలేదనే ఆరోపణలు వస్తున్నాయి. వాతావరణ శాస్త్రవేత్తలు.. ఈ భారీ వర్షం, వరదల గురించి తమిళనాడు ప్రభుత్వానికి ముందే హెచ్చరికలు జారీ చేశారని తెలుస్తోంది. పలుమార్లు హెచ్చరించినప్పటికీ అంతగా పట్టించుకోలేదని తెలుస్తోంది.
భారీ వరదలకు చెంబరంబక్కం చెరువు ఓవర్ ఫ్లో ఓ కారణం. సమాచారం మేరకు... డిఎంకె అధికారంలో ఉండగా... అక్కడి విషయమై శాస్త్రవేత్తలు హెచ్చరికలు జారీ చేశారు.
గ్రౌండ్ అండ్ సర్ఫేస్ వాటర్ రీసెర్చ్ అండ్ డేటా సెంటర్ ఈ హెచ్చరికలు జారీ చేసింది. ఇది రాష్ట్ర వాటర్ రిసోర్స్ ఆర్గనైజేషన్లో ఓ వింగ్. 2009లోనే హెచ్చరికలు జారీ చేశారు. పది సెంటిమీటర్లకు పైగా వర్షం కురిస్తే చెన్నైలో తీవ్ర నష్టం వాటిల్లుతుందని చెప్పారు.
వరద ప్రభావిత ప్రాంతాల్లో ఖుష్బూ
చెన్నైలో భారీ వర్షాలు, వరదలు కారణంగా దెబ్బతిన్న పలు ప్రాంతాలలో కాంగ్రెస్ నాయకురాలు, సినీ నటి ఖుష్బూ మంగళవారం పర్యటించారు. సైదాపేట, కొట్టూర్పురం ప్రాంతాల్లో తీసిన కొన్ని ఫొటోలను ఆమె తన ఫేస్బుక్ ఖాతాలో పోస్ట్ చేశారు.
ఇళ్ల పైకప్పులు పోయి, గోడలు కూలిపోయి పలువురు నిలువ నీడతోపాటు సర్వస్యం కోల్పోయారని, అక్కడి పరిస్థితులు చూస్తే హృదయం ద్రవిస్తోందని పేర్కొన్నారు. వారందరి జీవితాలను పునర్నిర్మించి, వారి జీవితాల్లో వెలుగులు నింపాల్సిన బాధ్యత అందరి మీదా ఉందన్నారు.