చెన్నై ఓ నరకకూపం.. 'రేప్' చేసి చంపేస్తే దిక్కేది?, గ్రామానికే వెళ్తున్నా: ఓ తండ్రి ఆవేదన
తన ఏడేళ్ల కుమార్తెపై ఓ కామాంధుడు అత్యాచారానికి పాల్పడి, ఆపై మృతదేహాన్ని తగలబెట్టడంతో ఆ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది.
చెన్నై: ఓ కామాంధుడు చేసిన పనికి ఆ కుటుంబం ఇప్పటికీ తేరుకోలేకపోతోంది. గ్రామీణ జీవితం కంటే పట్టణ జీవితంలో బతుకుదెరువుకు భరోసా ఎక్కువ అని నమ్మిన ఆ కుటుంబానికి చెన్నై నగరం విషాదాన్నే మిగిల్చింది. అందుకే ఆ తండ్రి చెన్నై నగరాన్ని ఓ నరకకూపంగా అభివర్ణించాడు.
చెన్నైలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అయిన రాజేష్ అనే ఓ తండ్రికి ఎదురైన ఈ అనుభవం.. ఇప్పటికీ ఆయన్ను తేరుకోనివ్వడం లేదు. తన ఏడేళ్ల కుమార్తెపై ఓ కామాంధుడు అత్యాచారానికి పాల్పడి, ఆపై మృతదేహాన్ని తగలబెట్టడంతో ఆ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. వృత్తి రీత్యా టీచర్ అయిన రాజేష్ భార్య కూడా ఇప్పటికీ ఆ ఘటన నుంచి తేరుకోలేకపోతోంది. ఐదేళ్ల వారి కుమారుడు అక్క కోసం ఏడుస్తూనే ఉన్నాడు.
పట్టించుకోని పోలీసులు:
న్యాయం చేయాలని ఎన్నిసార్లు పోలీసులు చుట్టూ తిరిగినా.. ఒక్కరూ పట్టించుకున్న పాపాన పోలేదు. ఘటన జరిగిన ఆర్నెళ్లు కావస్తున్నా.. ఇంతవరకు ఛార్జీ షీట్ కూడా దాఖలు చేయలేదు. ఈ ఆర్నెళ్ల కాలంలో కమిషనర్ దగ్గర నుంచి కానిస్టేబుల్ వరకు ఎందరో మారిపోయారని, కొత్తగా వచ్చిన ప్రతీ అధికారికి జరిగిన ఘటన గురించి వివరిస్తూనే వచ్చానని రాజేష్ ఆవేదన వ్యక్తం చేశాడు.
సొంతూరికి కటుంబం:
ఎవరి వద్ద ఎంత మొరపెట్టుకున్నా.. కేసులో ఇంతవరకు పోలీసుల వైపు నుంచి ఎలాంటి యాక్షన్ లేదని ఆవేదన చెందుతున్నాడు. చెన్నైలో ఇలాంటి పరిస్థితులను చూసిన తర్వాత తిరిగి తన స్వగ్రామానికే వెళ్లి బతకాలని నిర్ణయించుకున్నట్లు తెలిపాడు. ఏపీలోని తన సొంతూరుకు తన కుటుంబాన్ని తీసుకెళ్లిపోయానని చెప్పాడు.
మరణశిక్ష విధించాలి:
చాలామంది స్నేహితులు, బంధువులు జరిగిన దాన్ని మరిచిపోవాలని చెబుతున్నారని, కానీ అలా వదిలేస్తే.. వాడి చేతిలో మరొకరి జీవితం నాశనం అయిపోతుందని వాపోయాడు. అతనికి కచ్చితంగా మరణశిక్ష విధించాలని, చట్టాల మీద నమ్మకంతోనే తాను అతన్ని హత్య చేయడానికి వెనుకాడుతున్నానని అన్నాడు. మరణశిక్ష కాకుండా.. జైలు శిక్ష విధించడం ద్వారా, అక్కడ మరింత రాటుదేలే ప్రమాదం ఉందన్నాడు.
చెన్నై కన్నా గ్రామాలే సురక్షితం:
పిల్లలకు మంచి చదువు లభిస్తుందన్న ఉద్దేశంతో చెన్నైకి వస్తే.. తమకు ఇలాంటి పరిస్థితి ఎదురైందని కన్నీరుమున్నీరవుతున్నాడు. పిల్లలకు రక్షణే లేకపోతే ఇక చెన్నైలో ఉండి ఏం లాభమని ప్రశ్నించాడు. ఇప్పుడు తన కుమారుడు తన ఉరిలోని స్కూలుకు వెళ్తున్నాడని, గ్రామాలే సురక్షితమని చెప్పాడు.