ముఖ్యమంత్రికి చెర్నకోల దెబ్బలు: బాధను ఓర్చుకుంటూ: కొట్టిన వ్యక్తిని నమస్కరించి మరీ..
రాయ్పూర్: ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేలా చెర్నకోలతో దెబ్బలు తిన్నారు. అందరూ చూస్తుండగానే ఓ వ్యక్తి ఆయనకు ఆరుసార్లు చెర్నకొలతో కొట్టారు. ఆ వ్యక్తి తనను కొడుతున్నంత సేపూ ముఖ్యమంత్రి బాధను ఓర్చుకున్నారు. అనంతరం ఆ వ్యక్తికి నమస్కరించి మరీ అభినందించారు. ఆ వ్యక్తి పేరు బీరేంద్ర ఠాకూర్. ఛత్తీస్గఢ్లోని దుర్గ్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. దీపావళి వేడుకల్లో భాగంగా భూపేష్ బఘేల్ దుర్గ్ జిల్లాలోని జాంజ్గిరీ గ్రామానికి వెళ్లారు. స్థానిక ఆలయంలో ప్రత్యేక పూజలను నిర్వహించారు.
అనంతరం చెర్నకోల దెబ్బలను తిన్నారు. ఇలా చెర్నకోలతో దెబ్బలు తినడం ఆనవాయితీగా వస్తోంది. ప్రతి సంవత్సరం దీపావళి నాడు గోవర్ధన్ పూజకు ముందు చెర్నకోలతో దెబ్బలు తినే సంప్రదాయాన్ని భూపేష్ బఘేల్ పాటిస్తున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలను స్వీకరించిన తరువాత కూడా ఆయన ఆ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. ఏటా ఆయనకు భరోసా ఠాకూర్ అనే వృద్ధుడు చెర్నకోలతో కొట్టేవారు. కొద్దిరోజుల కిందట ఆయన మరణించారు. దీనితో ఆయన కుమారుడు బీరేంద్ర ఠాకూర్.. ముఖ్యమంత్రిని చెర్నకోలతో ఆరుసార్లు కొట్టారు.
Recommended Video
ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని తాను ప్రత్యేక పూజలను నిర్వహించినట్లు బఘేల్ చెప్పారు. ఈ కార్యక్రమాన్ని ముగించుకున్న అనంతరం ఆయన నేరుగా రాయ్పూర్కు బయలుదేరి వెళ్లారు. తన నివాసంలో గోవర్ధన్ పూజలో పాల్గొన్నారు. భార్యతో కలిసి గోవులకు పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన కొద్దిసేపు విలేకరులతో మాట్లాడారు. సంస్కృతి సంప్రదాయాలను పరిరక్షించుకోవాల్సిన అవసరం అందరి మీద ఉందని చెప్పారు. ప్రజల సంక్షేమానికి అవసరమైన కొత్త నిర్ణయాలను తీసుకోవడానికి ఇలాంటి కార్యక్రమాలు ఉపయోగపడతాయని అన్నారు.