కాల్పులతో తెగబడ్డ మావోయిస్టులు: ఇద్దరు జవాన్లు మృతి, మరొకరికి గాయాలు
బస్తర్: ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో మరోసారి మావోయిస్టులు దాడులకు తెగబడ్డారు. ఈ దాడిలో రాష్ట్ర సాయుధ దళానికి(సీఏఎఫ్)కు చెందిన ఇద్దరు జవాన్లు మృతి చెందారు. మరో బాంబు దాడి ఘటనలో ఓ సీఆర్పీఎఫ్ జవాను గాయపడ్డారు.
బస్తర్ జిల్లాలోని మర్దూమ్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరుగుతున్న రోడ్డు విస్తరణ పనుల వద్ద సీఏఎఫ్ సిబ్బంది పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా.. మావోయిస్టులు ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారు. ఈ దాడిలో ఛత్తీస్గఢ్ ఆర్మ్డ్ ఫోర్స్(సీఏఎఫ్)కు చెందిన ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లు ప్రాణాలు కోల్పోయారని ఐజీ తెలిపారు.
మర్దూమ్ ప్రాంతంలో జరిగిన మరో ఐఈడీ పేలుడు ఘటనలో ఒక సీఆర్పీఎఫ్ జవాను గాయపడనిట్లు వెల్లడించారు. ప్రస్తుతం అతడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని, అతని పరిస్థితి నిలకడగానే ఉందని చెప్పారు. కాగా, ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో మావోయిస్టులు ఇటీవల కాలంలో తరచూ దాడులకు పాల్పడటం స్థానికంగా ఆందోళనకర వాతావరణాన్ని సృష్టిస్తోంది.