ఐజీ రాత్రి ఫోన్ చేసి ఇంటికి రమ్మంటున్నారు: మహిళా కానిస్టేబుల్, ట్విస్ట్
రాయపూర్: తనను స్థానిక ఇన్స్పెక్టర్ ఆఫ్ జనరల్ పోలీస్ (ఐజీపీ) వేధింపులకు గురి చేస్తున్నారని ఓ మహిళా కానిస్టేబుల్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన సంఘటన చత్తీస్గడ్లో సంచలనం రేపింది. ఆమె ఓ పోలీస్ స్టేషన్లోను ఫిర్యాదు చేసింది. దీనిపై విచారణ జరుపుతున్నారు.
ఐజీపీ తనను లైంగికంగా వేధిస్తున్నారని ఆమె డీజీపీ దృష్టికి తీసుకెళ్లారు. బిలాస్పూర్ రేంజ్ ఐజీపీ పవన్ దేవ్ తనతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని, రాత్రివేళ ఫోన్ చేసి తన బంగ్లాకు రమ్మంటున్నారని సదరు మహిళా కానిస్టేబుల్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
1992 ఐపీఎస్ అధికారి అయిన ఆయన తనతో మాట్లాడే సమయంలో అసభ్య పదజాలం ఉపయోగిస్తున్నారని, ఫిర్యాదుతోపాటు ఆయన తనతో మాట్లాడిన ఫోన్ రికార్డింగులను కూడా ఆమె జత చేశారు.
గత నెల 17-18 తేదీల్లో హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ బిలాస్పూర్ పర్యటన కోసం డ్యూటీలో ఉన్న తనకు ఐజీపీ ఫోన్ చేసినట్టు చెప్పారు. ఆమె తన ఫిర్యాదు లేఖను ముఖ్యమంత్రి రమణ్ సింగ్కు, మహిళా కమిషన్లకు కూడా పంపించింది. ఈ విషయంలో విచారణ జరిపించాల్సిందిగా కోరుతూ మహిళా కమిషన్ సైతం డీజీపీకి లేఖ రాసింది.
ఖండించిన పవన్ దేవ్
ఆమె ఫిర్యాదును ఐజీపీ పవన్ దేవ్ ఖండించారు. ఆమెకు సన్నిహితంగా ఉండే పోలీస్ ఇన్స్పెక్టర్పై పలు ఫిర్యాదులు రావడంతో సస్పెండ్ చేశానని, దీంతో ఇద్దరూ కలిసి తనపై కుట్ర చేస్తున్నారని పేర్కొన్నారు. మహిళా కానిస్టుబుల్ ఆరోపణలపై స్పందించిన ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.