సెల్ నంబర్ 5: రాత్రంతా కునుకు లేని చిదంబరం: ఆరు దుప్పట్లు..ఫ్యాన్, వెస్టర్న్ టాయిలెట్
న్యూఢిల్లీ: ఐఎన్ఎక్స్ మీడియా కేసులో తీహార్ జైలు పాలైన కేంద్ర హోం, ఆర్థికశాఖల మాజీ మంత్రి పీ చిదంబరానికి ఏడో నంబర్ కారాగారాన్ని కేటాయించారు. ఇందులోని అయిదో నంబర్ సెల్ లో ఆయనను ఉంచారు. ఐఎన్ఎక్స్ మీడియా, ఎయిర్ సెల్-మ్యాక్సిస్ కేసులో సీబీఐ, ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఆయనను అదుపులోకి తీసుకున్న తరువాత చిదంబరం..జైలుపాలు కావడం ఇదే తొలిసారి. ఇప్పటిదాకా ఆయన సీబీఐ ప్రధాన కార్యాలయంలో విచారణను ఎదుర్కొన్నారు. తాజాగా- ఢిల్లీ రోజ్ అవెన్యూ న్యాయస్థానం కస్టడీని పొడిగించడంతో ఆయనను తీహార్ జైలుకు తరలించారు. గురువారం రాత్రి 8 గంటల సమయంలో అధికారులు చిదంబరాన్ని తీహార్ జైలు సూపరింటెండెంట్ కు అప్పగించారు.

రాత్రంతా కునుకు లేకుండా..
అరెస్టయిన తరువాత తొలిసారిగా కారాగారవాసాన్ని ఎదుర్కోవాల్సి రావడం, అదీ కరడుగట్టిన నేరస్తులను ఉంచే తీహార్ జైలు కావడంతో చిదంబరం తీవ్ర ఆందోళనకు గురైనట్లు కనిపించారు. గురువారం రాత్రంతా కంటి మీద కునుకు లేకుండా గడిపారు. తెల్లవారు జామున 4 గంటల సమయంలో ఆయన కొద్దిసేపు కునుకు తీసినట్లు జైలు సిబ్బంది తెలిపారు. ఏడో నంబర్ జైలు బ్యారక్ లోని సెల్ నంబర్ 5ను ఆయనకు కేటాయించారు. రాత్రి ఆయనకు భోజనాన్ని అందించినప్పటికీ.. తీసుకోలేదని సిబ్బంది వెల్లడించారు. కొన్ని ద్రవ పదార్థాలను తీసుకున్నారని చెప్పారు. చిదంబరం వయస్సును దృష్టిలో ఉంచుకుని నిద్రించడానికి వీలుగా మంచాన్ని ఏర్పాటు చేశారు. ఆరు దుప్పట్లను అందజేశారు. టేబుల్ ఫ్యాన్ తో పాటు చిదంబరం కోరిన విధంగా వెస్టర్న్ టాయిలెట్ సౌకర్యాన్ని కల్పించారు.

అదే బ్యారక్ లో కాశ్మీర్ వేర్పాటువాద నాయకుడు..
చిదంబరాన్ని ఖైదు చేసి ఉంచిన ఏడో నంబర్ బ్యారక్ లోనే జమ్మూ కాశ్మీర్ వేర్పాటు ఉద్యమ నాయకుడు యాసిన్ మాలిక్ ను ఉన్నారు. సుమారు మూడు నెలల కిందట యాసిన్ మాలిక్ ను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులు శ్రీనగర్ లో అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఉగ్రవాదం వైపు స్థానిక యువతను ప్రోత్సహిస్తున్నారనే ఆరోపణలను ఎదుర్కొంటున్న యాసిన్ మాలిక్ ను తీహార్ జైలుకు తరలించారు. ప్రస్తుతం ఏడో నంబర్ బ్యారక్ లో ఉంచారు. ఇంతకుముందు- ఆర్థిక నేరాల కేసు విచారణ విషయంలో అరెస్టయిన కార్తి చిదంబరం, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్ నాథ్ మేనల్లుడు రతుల్ పురీ, అగస్టా వెస్ట్ ల్యాండ్ హెలికాప్టర్ల కేసులో మధ్యవర్తిగా వ్యవహరించిన ఆరోపణలను ఎదుర్కొంటున్న క్రిస్టియన్ మైకెల్ జేమ్స్, దీపక్ తల్వార్ కేసులో అప్రూవర్ గా మారిన రాజీవ్ సక్సేనా ఏడో నంబర్ కారాగారం కాంప్లెక్స్ లో విచారణను ఎదుర్కొన్నారు.

జైలులో చిదంబరం ఒక్కరే..
సాధారణంగా ఏడో నంబర్ బ్యారక్ కాంప్లెక్స్ లోని సెల్ లల్లో ముగ్గురు చొప్పున ఖైదు చేస్తారు. చిదంబరానికి ఉన్న భద్రత కారణాల వల్ల ఆయన ఒక్కరినే ఒక సెల్ లో ఉంచారు. చిదంబరం కేంద్రంలో హోం మంత్రిగా పనిచేసిన సమయంలో వచ్చిన ప్రాణాంతక బెదిరింపులను దృష్టిలో ఉంచుకుని ఆయనకు జెడ్ కేటగిరి భద్రతను కల్పించారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని, న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాల మేరకు చిదంబరం ఒక్కిరకే ఒక సెల్ ను కేటాయించామని జైలు సిబ్బంది తెలిపారు. కోర్టు ఆదేశాల మేరకు మందులను వెంట తెచ్చుకోవడానికి అనుమతి ఇచ్చినట్లు చెప్పారు. చిదంబరం రిమాండ్ లో ఉన్నన్ని రోజులూ.. రోజుకు పదిమంది చొప్పున ఆయనను కలుసుకోవడానికి అనుమతి ఉందని అన్నారు.

తొలిసారి తీహార్ జైలు..
ఐఎన్ఎక్స్ మీడియా కేసులో అరెస్టయిన కేంద్ర మాజీ మంత్రి పీ చిదంబరం తీహార్ జైలు పాలయ్యారు. ఆయనను తీహార్ జైలుకు పంపిస్తూ ఢిల్లీ హైకోర్టు గురువారం సాయంత్రం ఆదేశాలు జారీ చేసింది. 14 రోజుల పాటు జ్యుడీషియల్ కస్టడీలోకి తీసుకోవాలని సూచించింది. రెండురోజుల పాటు సీబీఐ కస్టడీ గురువారం నాటికి ముగిసింది. దీనితో అధికారులు ఆయనను ఈ మధ్యాహ్నం ఢిల్లీ రోజ్ అవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మరో రెండు వారాల పాటు కస్టడీని పొడిగించాలని సీబీఐ అధికారులు విజ్ఞప్తి చేశారు. దీనికి హైకోర్టు ప్రత్యేక న్యాయమూర్తి జస్టిస్ అజయ్ కుమార్ కుగ్డా అంగీకరించారు. చిదంబరాన్ని ఈ నెల 19వ తేదీ వరకు జ్యుడీషియల్ కస్టడీలో తీసుకోవాలని సూచించారు. విచారణ సందర్భంగా ఆయనను తీహార్ జైలులో ఉంచాలని ఆదేశించారు.












Click it and Unblock the Notifications