మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఫిక్స్: 13 మందితో: ఆశావహుల సంఖ్య భారీగా..!
బెంగళూరు: కర్ణాటకలో మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం కుదిరింది. ఈ నెల 6వ తేదీన ఉదయం 10:30 మంత్రివర్గాన్ని విస్తరించబోతున్నట్లు ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప వెల్లడించారు. మొత్తం 13 మందితో మంత్రివర్గాన్ని విస్తరించబోతున్నారాయన. ఇందులో 10 మంది కొత్తగా శాసనసభకు ఎన్నికైన వారు ఉన్నారు. ఈ 10 మంది శాసనసభ్యులూ గత ఏడాది డిసెంబర్లో నిర్వహించిన ఉప ఎన్నికల్లో విజయం సాధించిన వారేనని తెలుస్తోంది.
కొత్తగా చేపట్టబోయే విస్తరణతో కర్ణాటక మంత్రివర్గ సభ్యుల సంఖ్య 31కి చేరుకుంటుంది. ఉప ఎన్నికల్లో విజయం సాధించిన రమేష్ జార్కిహోళి, ఎస్టీ సోమశేఖర్, బైరాతి బసవరాజ్, కే సుధాకర్, శివరాం హెబ్బార్, శ్రీమంత్ పాటిల్, బీసీ పాటిల్, ఆనంద్ సింగ్, కే గోపాలయ్య, కేసీ నారాయణ గౌడలను మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. మరో ఎమ్మెల్యే మహేష్ కుమఠళ్లిని కేబినెట్ హోదాను ఇచ్చి.. న్యూఢిల్లీలో కర్ణాటక ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా నియమిస్తారని ప్రచారం సాగుతోంది.
ఎనిమిది సార్లు శాసనసభకు ఎన్నికైన ఉమేష్ కత్తికి మంత్రివర్గంలో చోటు దాదాపుగా ఖాయమైనట్టేనని అంటున్నారు. అరవింద్ లింబావలి, హాలప్ప అచార్, వీ సునీల్ కుమార్, ఎమ్మెల్సీ సీపీ యోగీశ్వర్ పేర్లు కూడా ఆశావహుల జాబితాలో ఉన్నాయని తెలుస్తోంది. కూడికల మాట ఎలా ఉన్నప్పటికీ.. తీసివేతలకు అవకాశాలు లేకపోలేదని సమాచారం. కొంతమంది మంత్రుల పనితీరు, వారి వ్యాఖ్యల పట్ల ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప అసంతృప్తిగా ఉన్నారని, వారిని తప్పించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.
ఇదిలావుండగా.. మంత్రివర్గ విస్తరణ ఖాయం కావడం వల్ల పదవులపై ఆశ పెట్టుకున్న ఎమ్మెల్యేలు యడియూరప్ప నివాసానికి బారులు తీరుతున్నారు. బెంగళూరులోని ఉన్న ఆయన నివాసం వద్ద సందడి నెలకొంది. పలువురు ఎమ్మెల్యేలు ఆయనను కలుస్తున్నారు. బెంగళూరు నగరం పరిధిలోని ఎమ్మెల్యేలు పలువురు యడియూరప్పను కలిసిన వారిలో ఉన్నారు. అనర్హత వేటుకు గురైన ఏహెచ్ విశ్వనాథ్ కూడా ముఖ్యమంత్రిని కలిసిన వారిలో ఉన్నారని అంటున్నారు.